Devineni Avinash : జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని చూస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాలపై దృష్టి పెట్టారు. యువ నేతలను రంగంలోకి దించాలని చూస్తున్నారు. ప్రధానంగా విజయవాడ పై జగన్మోహన్ రెడ్డి కొత్త ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గం వైసీపీకి చిక్కలేదు. రకరకాల ప్రయోగాలు చేశారు. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. అందుకే ఈసారి మాస్టర్ ప్లాన్ తో ఉన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ లాంటి వారి పేర్లు బయటకు వచ్చాయి. కానీ వారు విముఖత చూపడంతో యువనేత దేవినేని అవినాష్ పేరు ఖరారు చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.. అయితే ఈ నిర్ణయం పై అవినాష్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాల్సిందేనని తేల్చి చెబుతున్నట్లు సమాచారం.
* మూడుసార్లు ఓటమి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత మూడు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 2014లో ఓ పారిశ్రామికవేత్తతో పోటీ చేయించారు. కానీ టిడిపి అభ్యర్థి కేశినేని నాని గెలిచారు. 2019లో సైతం మరో పారిశ్రామికవేత్తను రంగంలోకి దించారు. అయినా సరే వర్కౌట్ కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీంచింది కానీ.. విజయవాడలో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. మళ్లీ నాని గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో రెండుసార్లు ఎంపీగా గెలిచిన కేసినేని నానిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రప్పించి ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దించారు. అయినా ఫలితం లేకపోయింది. టిడిపి అభ్యర్థి కేసినేని శివనాథ్ గెలిచారు. ఒక విధంగా చెప్పాలంటే విజయవాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. అందుకే ఈసారి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని చూస్తున్నారు.
* కమ్మ సామాజిక వర్గం అధికం..
విజయవాడ పార్లమెంట్ సీటు ఎప్పుడు కమ్మ సామాజిక వర్గం వారికి వరిస్తూ వచ్చింది. ఇక్కడ బీసీలను ప్రయోగించాలని చూశారు జగన్మోహన్ రెడ్డి. కానీ అది సాధ్యపడలేదు. అందుకే కొడాలి నాని తో పాటు వల్లభనేని వంశీ మోహన్ లను పిలిచారు. విజయవాడ నుంచి పోటీ చేయించాలని సూచించారు. అందుకు వారు విముఖత చూపారు. అందుకే ఆయన దృష్టి దేవినేని అవినాష్ పై పడింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు అవినాష్. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. ప్రస్తుతం జగన్ వెంట చాలా చురుగ్గా తిరుగుతున్నారు. అందుకే ఈసారి విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. అయితే అందుకు అవినాష్ విముఖత చూపుతున్నట్లు సమాచారం. దీనిపై జగన్మోహన్ రెడ్డి సీరియస్ కావడంతో ఒప్పుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
