తెలంగాణలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారు. దాదాపు రూ.1000 కోట్ల విలువైన భూమిని తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పాటు ప్రభుత్వ జీవోలను సైతం తారుమారు చేసి కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. దొరికిపోవడంతో అడ్డంగా బుక్కయ్యారు. అయితే ఆయన పరారీలో ఉన్నట్టు తెలంగాణ పోలీసులు ప్రకటించారు. ఆయన మాత్రం తన సొంత నియోజకవర్గం వినుకొండలో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కుంభకోణం నుంచి ముందస్తు బెయిల్ దక్కించుకునేందుకు ఆయన న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ నుంచి ఆయనకు సహకారం ఉన్నట్లు అర్థం అవుతుంది. పోలీసులు ముందస్తు బెయిల్ దక్కే వరకు ఈ పరారీ నాటకం ఆడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఆయనకు తెలంగాణలో పెద్ద తలకాయల సహాయం ఉన్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
* చాలా పెద్ద నేరం..
బ్రహ్మనాయుడు చేసింది చిన్న నేరం కాదు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాదు.. ఏకంగా ప్రభుత్వ జీవోలను సైతం మార్చేశారు. ఇంతకంటే ఘోరం ఉంటుందా? తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పక్క రాష్ట్రంలో 1000 కోట్ల భూమికి సంబంధించిన అవినీతికి పాల్పడితే కనీసం నాయకత్వం స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఈ మూలం ఇప్పటిది కాదు అని తెలుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఈ భూమికి బ్రహ్మనాయుడు టెండర్ వేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు బ్రహ్మనాయుడు విషయంలో కాపాడుతుంది ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వ జీవోలను మార్చేయడం అంటే చిన్న విషయం కాదు. ఏ ప్రభుత్వమైనా దీనిని తీవ్రంగా పరిగణిస్తుంది. అయితే తెలంగాణ పోలీసులు బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారని.. పట్టుకుంటామని మాత్రమే చెబుతున్నారు. ఆయన మాత్రం తన సొంత నియోజకవర్గంలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
* వినుకొండ నియోజకవర్గంలో సైతం..
మరోవైపు వినుకొండ టిడిపి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మీడియా ముందుకు వచ్చారు. బ్రహ్మనాయుడు భూ అరాచకాలు వినుకొండలో సైతం ఉన్నాయని ఆరోపించారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కొల్లగొట్టారని.. జగన్మోహన్ రెడ్డికి సైతం వాటాలు పంపించారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. వాస్తవానికి బ్రహ్మనాయుడు కు మంచి పేరు ఉంది. తిరుమల డైరీ ని అభివృద్ధి చేసి తన వాటాను అమ్ముకొని ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనకు అవినీతి మరక అంటింది. వైసిపి హయాంలోనే తెలంగాణ లో కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడే ఈ భూభాగోతానికి పాల్పడ్డారు అన్నది ప్రధాన ఆరోపణ. అయితే భారీ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత.. ఆయనను తెలంగాణ నుంచి కాపాడుతున్నది ఎవరు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేనిపోని వివాదాలపై మాట్లాడుతోంది. కానీ సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇంత భారీ స్థాయిలో అవినీతికి పాల్పడితే నిమ్మకు నీరెత్తన్నట్టు ఉంది.
