Visakhapatnam development 2026 : సముద్రం.. ఆర్కే బీచ్.. నేవీ.. కొండలు.. మన్యం ప్రాంతం.. విశాఖపట్నం పేరు ప్రస్తావనకు వస్తే మన మదిలో ఈ ప్రాంతాలు మెదులుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఐకానిక్ ప్రదేశాలుగా పేరుపొందాయి. ఇప్పుడు వీటి స్థానంలో మానవ నిర్మిత అభివృద్ధి కేంద్రాలు స్థానం సంపాదించుకోబోతున్నాయి. అవి కేవలం విశాఖపట్నం నగరాన్ని మాత్రమే కాదు.. యావత్ ఆంధ్రదేశ భవితను మొత్తం మార్చబోతున్నాయి.
విశాఖపట్నం ప్రాంతాన్ని పర్యాటకంగానే ఇప్పటిదాకా చూశారు. అయితే ఆ నగరంలో మరో కోణాన్ని చూశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. అందువల్లే ఈ ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఆయన శ్రీకారం చుట్టారు. 2014 నుంచి 2019 వరకు విశాఖపట్నంలో విస్తృతంగా రోడ్లను నిర్మించారు. ఐటీ కార్యకలాపాలకు విశాఖపట్నం అనుకూలంగా ఉంటుందని కార్పొరేట్ కంపెనీలకు సంకేతాలు పంపించారు. దీంతో మనదేశంలో పేరుపొందిన కంపెనీలు శాఖలను ఏర్పాటు చేశాయి. 2019లో ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఐటీ కార్యకలాపాలు మందగించాయి.
మళ్లీ ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం రూపు రేఖలు మారిపోతున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా ఐటీ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇప్పటికాలానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా పనిచేసే డేటా సెంటర్లు కూడా విశాఖపట్నంలో ఏర్పాటు కాబోతున్నాయి. దీనికి తోడు క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో కూడా విశాఖపట్నం అగ్రగామిగా వెలుగొందడానికి అడుగులు వేస్తోంది. విశాఖపట్నంలో మౌలిక వసతులు పెరిగిపోవడం.. భూములు ఇవ్వడానికి రైతులు ముందుకు రావడంతో అక్కడ పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతోంది..
చంద్రబాబు విశాఖపట్నం గ్లోబల్ క్యాపిటల్ గా మార్చడానికి అడుగులు వేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరంలో ఐటి అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారు. ఇప్పుడు ఏపీలో ముఖ్యంగా విశాఖపట్నంలో ఐటీ ఆధారిత కార్యకలాపాలు సాగడానికి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. విశాఖపట్నం కి గ్లోబల్ గుర్తింపు తీసుకురావడానికి ఆ మధ్య జరిగిన ప్రపంచం పెట్టుబడిదారుల సదస్సులను ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో గూగుల్ వంటి సంస్థలు తమ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి అనుకూల పరిస్థితులు కల్పించారు. కేంద్రంలో ఎలాగూ సపోర్ట్ ఉంది కాబట్టి.. చంద్రబాబు గూగుల్ ప్రతినిధులతో మంతనాలు జరపడం ఈజీ అయిపోయింది.
ఐటీ మంత్రిగా నారా లోకేష్ తెరమందు ప్రయత్నాలు మొత్తం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను సరళీకృతం చేశారు. ప్రపంచ పెట్టుబడిదారులకు గుమ్మంగా విశాఖపట్నం ఎందుకు ఉంటుందో పదేపదే వివరించే ప్రయత్నం చేశారు. దీనికి తోడు భూముల కేటాయింపు నుంచి మొదలుపెడితే అనుమతుల వరకు ప్రతి విషయంలోనూ ఆయన చొరవ తీసుకున్నారు. అందువల్లే గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. గూగుల్ సంస్థ రావడంతో.. రిలయన్స్.. అదాని.. మిట్టల్ వంటి సంస్థలు కూడా వచ్చేశాయి. ఇవన్నీ కూడా ఒక విశాఖపట్నం నగరంలోనే దాదాపు మూడు లక్షల కోట్లకు మించి పెట్టుబడులు పెడుతున్నాయి. దీనిని బట్టి విశాఖపట్నం నగరానికి భవిష్యత్తు కాలంలో ఏ స్థాయిలో డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. ఒక బిజినెస్ ఏర్పాటు కావాలంటే దానికి అనుకూల పరిస్థితులు ఉండాలి. ఆ పరిస్థితులను చంద్రబాబు కల్పించారు కాబట్టి.. విశాఖపట్నం గ్లోబల్ కాపిటల్ గా మారబోతోంది.
