Site icon OkTelugu

Andhra Pradesh Investment Summit 2026: పెట్టుబడుల సదస్సు.. ఆ ఐదు నగరాల్లో సైతం!

Andhra Pradesh Investment Summit 2026

Andhra Pradesh Investment Summit 2026

Andhra Pradesh Investment Summit 2026: ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. దూకుడు నిర్ణయాలు తీసుకుంటోంది. రాజకీయపరమైన నిర్ణయాలు ఒక వైపు తీసుకుంటూనే.. పాలనాపరంగా కూడా దృష్టి పెట్టింది. పెట్టుబడులు ఆకర్షించే నిరంతర ప్రయత్నం కొనసాగాలని భావిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది సిఐఐ భాగస్వామి సదస్సు 2026ను నవంబర్లో నిర్వహించేందుకు కసరత్తు మొదలైంది. ఇప్పటికే ఈ సదస్సు నిర్వహణపై ఓ ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. అయితే ఈ సదస్సు ఒక నగరానికి పరిమితం చేయకుండా.. గతానికి భిన్నంగా ప్రాంతీయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు భావించారు. యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఇచ్చారు. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో ప్రధాన సదస్సు నిర్వహిస్తారు. అంతకంటే ముందే రాష్ట్రంలోని ఐదు ప్రముఖ నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సదస్సులు నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం విశేషం.

* రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ..
ప్రస్తుతం ప్రధాన నగరాల జాబితాలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, అనంతపురం, కాకినాడ తదితర నగరాలు ఉన్నాయి. విశాఖలో ప్రధాన సదస్సు జరుగుతున్న దృష్ట్యా మిగతా ఐదు నగరాల్లో ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల వికేంద్రీకరణ కేవలం ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనేది సీఎం చంద్రబాబు సంకల్పం. ఏయే ప్రాంతాల్లో ఏయే రంగాలకు చెందిన పరిశ్రమలు స్థాపించేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయో.. గుర్తించేందుకు ఈ ప్రాంతీయ సదస్సులు ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు. స్థానిక అవసరాలకు తగ్గట్టు ఒప్పందాలు కుదుర్చుకునేలా పక్కాగా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

గతంలో విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించారు. ఆ సమయంలో ప్రాంతీయ నగరాల పేర్లు పరిగణలోకి వచ్చాయి. పెట్టుబడులు కూడా ఒకే ప్రాంతానికి తరలిస్తున్నారన్న విమర్శ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. అందుకే ఈసారి పారిశ్రామిక సదస్సులను రీజనల్ స్థాయికి తీసుకెళ్లడం ద్వారా.. ప్రభుత్వ కృషి ప్రజలకు నేరుగా అర్థం కావడంతో పాటు స్థానిక యువతతో పాటు జెన్ జి భాగస్వామ్యం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

* భారీగా ప్రచారం..
విశాఖ పెట్టుబడుల సదస్సుకు భారీగా ప్రచారం కల్పించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశంలోని ప్రముఖ నగరాలుగా ఉన్న ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, హైదరాబాదులలో భారీ రోడ్ షోలు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ సిద్దం చేశారు. అంతర్జాతీయ డెలిగేట్స్, ప్రముఖ యూనివర్సిటీల నిపుణులు, కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా లేఖలు రాసి ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన వాతావరణాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేయనున్నారు. పెట్టుబడుల సదస్సులు అంటే కేవలం కంపెనీలతో ఒప్పందాలు కాదు.. అంతర్జాతీయ నిపుణుల ద్వారా నాలెడ్జ్ షేరింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

Exit mobile version