Tummala Nageswara Rao : భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవమానాలు చేసింది. వాటితో పోల్చి చూసుకుంటే ఇది ఒక లెక్కా.. అని ఖమ్మం జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. నిజమే పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ దారుణమైన అవమానం చేసింది. ఈ నాటికి కూడా ఆ అపర ఆర్థిక చాణక్యుడికి కనీసం నివాళి కూడా అర్పించలేకపోతోంది. అది కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతనానికి బలమైన నిదర్శనం. కానీ ఇవాటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ మహా మనిషికి గౌరవం ఇవ్వకపోగా.. మరింత ఇబ్బంది పెడుతోంది. కొన్ని సందర్భాలలో అభాసుపాలు చేస్తోంది.

మన ఇంట్లో ఎవరైనా చనిపోతే స్మారకాన్ని నిర్మిస్తాం. వర్ధంతి, జయంతి సందర్భంగా అక్కడికి వెళ్లి నివాళులర్పిస్తాం. ఆ స్మారకం ఉన్న ప్రాంతంలోనే మరొక స్మారకాన్ని నిర్మిస్తామంటే అసలు ఒప్పుకోము. ఎందుకంటే ఒక మనిషి భౌతికంగా లేకపోయినా.. ఆయనకు సంబంధించిన స్మారకం ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటాం. కానీ ఈ సోయి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు లేకుండా పోయింది.
ఖమ్మం జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు కాంగ్రెస్ మంత్రులలో తుమ్మల నాగేశ్వరరావు ఒకరు. ఈయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. తెలుగుదేశం పార్టీలో ఈయన తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిలో చేరారు. మంత్రిగా పనిచేశారు. తనకు విలువ ఇవ్వడం లేదని.. కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి బలవంతంగా ఉమ్మడి ఖమ్మం మీద రుద్దుతున్నారని ఆరోపిస్తూ.. కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను.. కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను విమర్శించే తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీలో చేరడం నిజంగా ఆశ్చర్యకరమే.
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు పనిచేస్తున్నారు. ఆయన సరిగా 1986లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన సుదీర్ఘంగా రాజకీయాలలో కొనసాగుతున్నారు. రాజకీయాలలో కొనసాగుతూ 40 సంవత్సరాల కాలాన్ని ఆయన పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఖమ్మంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు. కొన్ని పత్రికలు తుమ్మల మీద కథనాల మీద కథనాలు రాశాయి. ఆదే స్థాయిలో యాడ్స్ కూడా దండుకున్నాయి. అయితే తుమ్మల 40 సంవత్సరాల రాజకీయ ప్రస్తానానికి సంబంధించి ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఒక పైలాన్ నిర్మించేందుకు సంకల్పించారు. పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటుచేసిన ప్రాంతంలోనే పైలాన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం కూడా మొదలుపెట్టారు. ఇది పీవీ నరసింహారావు అభిమానులకు ఆగ్రహాన్ని కలిగించింది. వెంటనే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇది కాస్త రాజకీయంగా ఇబ్బంది కలిగించే పరిణామం కావడంతో వెంటనే తుమ్మల నాగేశ్వర రావు స్పందించారు. పైలాన్ నిర్మాణం నిలిపివేయాలని కేఎంసీ కమిషనర్ ను ఆదేశించారు. దీంతో పైలాన్ ఆగిపోయింది.
భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.. పీవీ నరసింహారావు విగ్రహం చుట్టూ రైలింగ్ ఏర్పాటు చేసింది. అయితే ఆ విగ్రహం ఉన్న ప్రాంతంలోనే పైలాన్ నిర్మించడం సరికొత్త చర్చకు దారి తీసింది.