వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాసనసభాపతిగా ఉన్న తమ్మినేని సీతారాం భూకబ్జాలకు పాల్పడ్డారు. చాపురం పంచాయతీ లోని బలగ గ్రామ పరిధిలో కట్ట కనక లింగేశ్వర రావు కొనుగోలు చేసిన భూమిని సీతారాం ఆక్రమించారు. ఆ తర్వాత రకరకాల అక్రమాలకు పాల్పడ్డారు. ఆ ప్లాట్లను తన కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఇంతటితోనే ఆగిపోలేదు భూమిని కుమారుడి పేరు మీద చేయించడానికి శ్రీకాకుళం మున్సిపాలిటీలో కనక లింగేశ్వర రావు చనిపోయినట్టు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని రూపొందించారు. మొత్తంగా 922 చదరపు గజాల స్థలాన్ని తన కుమారుడు పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఈ వ్యవహారంలో ఏపీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో సీతారాం భూకబ్జా కథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా రజిని, ఆమె అల్లుడు సలిపల్లి లక్ష్మణరావు.. సతీష్ కుమార్.. త్రినాధ్.. తమ్మినేని సీతారాం.. ఆయన భార్య వాణి ఉన్నారు. వీరు సహకరించడం వల్లే కూన పెద్దిరాజు అనే డాక్యుమెంట్ రైటర్ నకిలీ పత్రాలు సృష్టించారు. తమ్మినేని సీతారాం కు చెందిన డిగ్రీ కాలేజీలో పనిచేసే సిబ్బంది తో దారుణమైన పనులు చేయించారు. రిజిస్ట్రేషన్ సమయంలో వారితో సాక్షుల సంతకాలు పెట్టించారు. భూమికోసం తమ్మినేని ఇంతటి కుట్రలకు పాల్పడ్డారు. భూమి విలువ కోట్లలో ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
ఇక ఈ కేసులో నకిలీ పత్రాలు ముఠాతో తమ్మినేని కుటుంబం సంబంధాలు కొనసాగించింది.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న త్రినాధ్ మాజీ హోంగార్డు. ఇతడి మీద మూడు కేసులున్నాయి. సతీష్ కుమార్ కూడా కేసులు ఎదుర్కొంటున్నాడు. లక్ష్మణరావు.. రజిని.. మిగతావారు ఒక ముఠాగా ఏర్పడ్డారు. భూములను కబ్జా చేస్తున్నారు.. ఐదు సంవత్సరాల క్రితమే రజిని ద్వారా ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కూడా చేయించారు.. ఒడిశా రాష్ట్రంలోని జయపుర ప్రాంతంలో రజనీ నివాసం ఉంటున్నది. ఇలాంటి అడ్డగోలు భూ వ్యవహారాల కోసమే బొబ్బిలి వచ్చింది. తన అల్లుడి చిరునామా ద్వారా మరో ఆధార్ తీసుకుంది. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఇక ఈ వ్యవహారంలో ఆమెకు భారీగానే నగదు ముట్టినట్టు తెలుస్తోంది. ఈకేసును పోలీసులు లోతుగా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇంకా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.


