Ravindra Jadeja vs CSK : ఏ ముహూర్తంలో అయితే చెన్నై జట్టు సంజు శాంసన్ కోసం రవీంద్ర జడేజాను రాజస్థాన్ జట్టుకు పంపించిందో.. అప్పటినుంచి చెడు సంకేతాలు మొదలయ్యాయి. అవి కాస్త చెన్నై జట్టును సోమవారం పుట్టి ముంచాయి. దీంతో చెన్నై జట్టు చూస్తూ ఉండిపోవడం తప్ప.. ఏమీ చేయలేని పరిస్థితి.. పుండు మీద కారం చల్లినట్టు.. రవీంద్ర జడేజా అద్భుతమైన బౌలింగ్ చేసి.. గన్ ఫైర్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టాడు. దీంతో చెన్నై జట్టు పరుగు గౌహతివేదికగా పోయింది.
సంజు శాంసన్ కోసం చెన్నై జట్టు రవీంద్ర జడేజాను బలి పెట్టింది. వాస్తవానికి రవీంద్ర జడేజా అద్భుతమైన ఆటగాడు. చెన్నై జట్టులో చాలా కాలంగా ఆడుతున్నాడు. 2023లో చెన్నై జట్టు ఐపిఎల్ గెలవడానికి రవీంద్ర జడేజా ప్రధాన కారణం. అటువంటి ఆటగాడిని చెన్నై మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. సంజు శాంసన్ కోసం అతడిని రాజస్థాన్ పంపించింది.
రాజస్థాన్ జట్టు లో చేరిన తర్వాత రవీంద్ర జడేజా తన మిషన్ ప్రారంభించాడు. తన మిస్టరీ స్పిన్ కు మరింత మెరుగులు అద్దాడు. చెన్నై బ్యాటర్ల లోపాలు తెలుసు కాబట్టి.. పదేపదే అదే బంతులను వేశాడు. దీంతో చెన్నై బ్యాటర్లు అతని బుట్టలో పడ్డారు. ముఖ్యంగా తన బౌలింగ్లో శివం దుబే సిక్సర్ కొడితే రవీంద్ర జడేజా తీవ్రమైన అసహనానికి గురయ్యాడు. ఆ తర్వాత వెంటనే అతడిని అవుట్ చేసి తన రివేంజ్ తీర్చుకున్నాడు.. గన్ ఫైర్ సెలబ్రేషన్స్ చేసి.. సోషల్ మీడియాను షేక్ చేశాడు.
సాధారణంగా రవీంద్ర జడేజా కూల్ గా ఉంటాడు. పెద్దగా ఏ విషయాన్ని కూడా పట్టించుకోడు. కానీ ఒకసారి తనను గెలికితే.. సినిమా చూపిస్తాడు. చెన్నై జట్టుకు గౌహతిలో అతడు చూపించింది అదే. ఇప్పుడు చెన్నై మేనేజ్మెంట్ చింతించి కూడా ఉపయోగం లేదు.. ఎందుకంటే ఆల్రెడీ రవీంద్ర జడేజా వైల్డ్ ఫైర్ రేంజ్ లో ఉన్నాడు. అతడిని అదుపు చేయడం కష్టం. అతనిలో ఉన్న ఫైర్ ను చల్లార్చడం మరింత కష్టం.
రాజస్థాన్ జట్టుకు వచ్చిన తర్వాత రవీంద్ర జడేజా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శించాలని బలమైన నిర్ణయంతో ఉన్నాడు. అందువల్లే మిగతా ప్లేయర్లు కాస్త విరామం తీసుకుంటున్నప్పటికీ.. జడేజా మాత్రం తగ్గడం లేదు. తన శరీరానికి విశ్రాంతి ఇవ్వడం లేదు. దూకుడును ఆయుధంగా.. తెలివిని అస్త్రంగా మార్చుకొని బౌలింగ్ వేస్తున్నాడు. ఆ ఎఫెక్ట్ సోమవారం నాటి మ్యాచ్లో కనిపించింది. ఇకపై రవీంద్ర జడేజా ఇదే స్థాయిలో బౌలింగ్ వేస్తే రాజస్థాన్ జట్టుకు తిరుగు ఉండదు.