Ramoji Rao Death Anniversary : ఈరోజు రామోజీరావు వర్ధంతి.. సహజంగానే తెలుగు పత్రికా రంగంలో ఎన్నో రకాల మార్పులకు.. సంచలనాలకు ఆయన కారణం. ఎక్కడో ఖమ్మంలో చిన్నపాటి ఫెర్టిలైజర్ షాపు పెట్టిన అతను.. ఈరోజు వేలకోట్లు సంపాదించాడు అంటే మామూలు విషయం కాదు. ఈ సంపాదన అక్రమమా.. సక్రమమా అనే విషయాన్నీ పక్కన పెడితే.. పేపర్, పచ్చళ్ళు, సినిమాలు, హోటళ్లు, చానెళ్ళు .. ఆయన అడుగుపెట్టని రంగం అంటూ లేదు. చేయని వ్యాపారం అంటూ లేదు. లాభాలు వచ్చాయి.. నష్టాలు కూడా పలకరించాయి. అయినప్పటికీ రామోజీరావు వెనుకడుగు వేయలేదు. వెనకడుగు వేస్తే ఆయన రామోజీరావు ఎందుకు అవుతారు.
మార్గదర్శి విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ పెట్టిన ఇబ్బందులు.. రాజశేఖర్ రెడ్డి చూపించిన చుక్కలు.. ఆ స్థానంలో మరొకరు ఉంటే చేతులు జోడించి వెళ్లిపోయేవారు. నాటి రోజుల్లో.. కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టని వ్యక్తిత్వం అయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంతోనే రాజశేఖర్ రెడ్డికి చెప్పించాడు అంటే రామోజీరావు గుండె ధైర్యం ఎంతటిదో వివరించాల్సిన అవసరం లేదు. అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతంలో కమ్యూనిస్టులు ధర్నాలు చేస్తుంటే.. తన రామోజీ ఫిలిం సిటీ అక్రమం అని ఆరోపణలు చేస్తుంటే.. వారి మూతులకు గట్టి బిరడా బిగించాడు. అంతటి సాహసి రామోజీరావు.
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతంలో చెరువులు ఆక్రమించారని.. అసైన్డ్ భూముల్లో ఫిలిం సిటీ కట్టారని.. ఆ భూములు మొత్తం పేదలకు ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి గట్టిగా ప్రయత్నించారు. అధికారులను పంపించారు. కానీ రాజశేఖర్ రెడ్డి ఉన్నన్ని రోజులు రామోజీ ఫిలిం సిటీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సాక్షి ఎన్నో రాతలు రాసినప్పటికీ రామోజీ ఫిలిం సిటీ ఇటుక కూడా ఊడిపోలేదు.. అంతటి సౌధాలు నిర్మించుకున్నాడు.. వ్యాపార సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నాడు రామోజీ.
“వార్త” పత్రికను తొక్కిపెట్టాడు. తనకు నచ్చని దాసరి నారాయణరావు ఉదయాన్ని చీకట్లో కలిపేశాడు. తనకంటూ పోటీ లేకుండా చేసుకున్నాడు. తను నిత్యం వ్యాపారం మాత్రమే చూస్తాడు. అందులో సెంటిమెంట్ కలిపి దర్జాగా వెనకేసుకుంటాడు. లేకపోతే తుఫాన్ సమయంలో విమానాలలో పత్రికను సరఫరా చేయడమేంటి.. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తన ఈనాడు పత్రికను సమయానికి పంపించడమేంటి.. పని చేయించుకునే విషయంలో.. డబ్బులు సమయానికి చెల్లించే విషయంలో.. రామోజీరావు ఓ రాక్షసుడు. ఈ మాట ఆయనతో పని చేసిన వారు ఇప్పటికీ అంటూనే ఉంటారు. గజ్జల మల్లారెడ్డి నుంచి మొదలు పెడితే ఇప్పటి నాగేశ్వరరావు, డిఎన్ రావు వరకు.. అతడు స్నేహం సాగించాడు. ఆ స్నేహంలోనే పనిని మరింత ముందుకు తీసుకెళ్లాడు.
నేడు రామోజీరావు వర్ధంతి. అతడు విలువల సవ్యసాచి కాకపోవచ్చు. సక్రమంగా వ్యాపారం సాగించిన బిజినెస్మెన్ కాకపోవచ్చు.. కానీ వేలాది మందికి ఉపాధి కల్పించాడు. లక్షల మందికి పరోక్షంగా భరోసా ఇచ్చాడు. అతడి కోటను చూస్తే.. అచ్చం కేజీఎఫ్ సినిమాలో సౌధం లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కోటలో రామోజీరావు కచ్చితంగా ఉండే ఉంటాడు. కాకపోతే భౌతికంగా లేడు కాబట్టి.. మానవమాత్రులకు కనిపించడు. ఎందుకంటే రామోజీరావు ఇప్పుడు మనిషి కాదు.. తాను నిర్మించిన వేలకోట్లకు కనిపించని అధిపతి. అన్నిటికంటే ముఖ్యంగా బతికున్నప్పుడే తనకంటూ సమాధిని నిర్మించుకున్న స్థపతి.
