Modi Foreign Tour భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై 6 నుంచి ఆరు రోజులపాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటించబోతున్నారు. ఇటీవల సీషెల్స్లో మూడు రోజులు గడిపిన తర్వాత ఈ మూడు దేశాలో ఆరు రోజులు పర్యటించనున్నారు. ఈ పర్యటన భారత విదేశాంగ విధానంలో కొత్త దశను సూచిస్తోంది. హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్ వరకు భారత ప్రయోజనాలను రక్షించడం, వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడం, చైనా ప్రభావాన్ని సమతుల్యం చేయడం ఈ పర్యటన వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలు.
ఇండోనేషియా కీలకం..
హిందూ మహాసముద్రం, పసిఫిక్ సముద్రాల మధ్య ఉన్న ఇండోనేషియా భౌగోళికంగా అత్యంత కీలకమైన స్థానంలో ఉంది. మలక్కా, సుండా, లుంబోక్ జలసంధులు రెండు మహాసముద్రాలను కలిపే మార్గాలు. ముఖ్యంగా మలక్కా సంధి చైనా శక్తి సరఫరాకు ప్రధాన మార్గం కావడంతో ఇక్కడ భారత్కు వ్యూహాత్మక ప్రాధాన్యం ఏర్పడింది. అండమాన్ నికోబార్ దీవుల్లో గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టు ద్వారా భారత్ ఈ ప్రాంతంపై నిఘా పెంచుతోంది.ఇండోనేషియాతో రక్షణ సహకారం బలపడుతోంది. బ్రహ్మోస్ క్షిపణి సరఫరాపై చర్చలు జరుగుతున్నాయి. నికెల్ వనరులు, పామాయిల్ దిగుమతి వంటి ఆర్థిక అవసరాలు కూడా ఈ సంబంధాన్ని మరింత బలపరుస్తున్నాయి. ఇండోనేషియాతో సంబంధాలు బలపడితే హిందూ–పసిఫిక్లో భారత స్థానం గణనీయంగా మెరుగుపడుతుంది.
ఆస్ట్రేలియాతో రక్షణ, వ్యాపారం..
ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ భారత–ఆస్ట్రేలియా వార్షిక సమావేశంలో పాల్గొంటారు. సీఈవోల సమావేశం, విద్యార్థుల సంబంధిత చర్చలు కూడా జరగనున్నాయి. ఈ సందర్భంగా క్రిటికల్ మినరల్స్ సరఫరా, సముద్ర భద్రత, ఉమ్మడి రక్షణ చర్యలపై లోతైన చర్చలు జరుగుతాయి.ఆస్ట్రేలియా భారత్కు విశ్వసనీయ భాగస్వామి. క్వాడ్లో భాగంగా రెండు దేశాలు ఇప్పటికే సన్నిహితంగా పని చేస్తున్నాయి. చైనా ప్రభావం పెరుగుతున్న పసిఫిక్ ప్రాంతంలో ఆస్ట్రేలియాతో సంబంధాలు బలపడడం భారత్కు అవసరం. వాణిజ్యం, విద్య, రక్షణ రంగాల్లో సహకారం పెంచడం ఈ పర్యటనలో ప్రధాన లక్ష్యం.
న్యూజిలాండ్కు 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని..
న్యూజిలాండ్కు ప్రధాని మోదీ సందర్శన ఇందిరా గాంధీ తర్వాత 40 ఏళ్లకు మొదటిసారి జరగనుంది. ఇక్కడ భారతీయ సమాజం పెద్ద సంఖ్యలో ఉండటం, క్రిటికల్ మినరల్స్ వనరులు, సముద్ర జలాల రక్షణ వంటి అంశాలు చర్చకు రానున్నాయి.న్యూజిలాండ్తో సంబంధాలు ఎక్కువగా వాణిజ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో ఉన్నాయి. ఈ సందర్శన ద్వారా రెండు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సంబంధాలను మరింతగా బలపరచడం సాధ్యమవుతుంది. పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రభావాన్ని విస్తరించడంలో న్యూజిలాండ్ కూడా ముఖ్యమైన భాగస్వామి కావచ్చు.
విదేశాంగ విధానంలో కీలక పరిణామం..
లుక్ ఈస్ట్ నుంచి ఇండో–పసిఫిక్ వరకుగతంలో భారత్ చుట్టుపక్కల దేశాలపై ఎక్కువ దృష్టి పెట్టేది. పీవీ నరసింహారావు లుక్ ఈస్ట్ పాలసీ తీసుకురాగా, మోదీ ప్రభుత్వం ఆగ్నేయాసియా, పసిఫిక్ ప్రాంతాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చింది. లుక్ ఈస్ట్, ఆ తర్వాత యాక్ట్ ఈస్ట్ విధానాలు ఇప్పుడు దక్షిణ ఇండో–పసిఫిక్ వరకు విస్తరించాయి. ఇటీవల సీషెల్స్ పర్యటన హిందూ మహాసముద్రంలో భారత ప్రయోజనాలను కాపాడడానికి సహాయపడింది. ఇప్పుడు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటన ద్వారా పసిఫిక్ వైపు కూడా భారత్ తన స్థానాన్ని బలపరుస్తోంది. చైనా ప్రభావం పెరుగుతున్న ప్రాంతంలో భారత్ స్వతంత్ర విధానం అనుసరిస్తూ, విశ్వసనీయ భాగస్వాములతో సంబంధాలు బలపరచుకుంటోంది.
ఈ మూడు దేశాల పర్యటన కేవలం దౌత్య సందర్శన కాదు. ఇది భారత్ హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్ వరకు తన వ్యూహాత్మక పరిధిని విస్తరించడానికి చేస్తున్న కృషి. రక్షణ సహకారం, వాణిజ్య విస్తరణ, సముద్ర భద్రత, క్రిటికల్ మినరల్స్ సరఫరా వంటి అంశాలు ఈ పర్యటనలో కీలకంగా ఉంటాయి. భారత్ ఇప్పుడు ప్రపంచ వ్యవహారాల్లో మరింత చురుకుగా పాల్గొంటూ, తన భద్రతా, ఆర్థిక ప్రయోజనాలను రక్షించుకునే దిశగా అడుగులు వేస్తోంది.

