Pawan Kalyan Sena Galam : పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా రాజకీయాల్లో జరుగుతున్న కుల, వ్యక్తిగత దాడిని నియంత్రించేందుకు గట్టి వ్యూహాన్ని రూపొందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ తరువాత తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ పై ఎదురైన వ్యక్తిగత దాడి, సామాజిక దాడి గురించి అందరికీ తెలిసిన విషయమే. దీనిపై తెలంగాణ జనసేన నేతలు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. గట్టిగానే బదులిచ్చారు. అయితే ఇలా కాకుండా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ పై ఇదే రేంజ్ లో కుట్రలు జరుగుతాయి అన్నది తెలుసు. అందుకే దానిని బలంగా తిప్పికొట్టేందుకు సేన గళం పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. ప్రధానంగా జనసేన పై కాపు, కుటుంబ వ్యవహారాలు వంటి వివాదాలను నెట్టేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అటువంటి వారి మాటలను తిప్పికొట్టేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
* అన్ని సామాజిక వర్గం నేతలు..
జనసేనలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఉన్నారు.. పవన్ కళ్యాణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. జనసైనికులు కూడా అదే దూకుడుతో వ్యవహరిస్తుంటారు ప్రత్యర్థులపై. అయితే ఈసారి రాజకీయ ప్రత్యర్థుల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టేందుకు ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. పవన్ కళ్యాణ్ ను ప్రత్యర్థి పార్టీల్లో కాపు నేతలు తిడితే.. ఈ సేన గళం లో ఉన్న కాపు నేతలు స్పందిస్తారు. ఒకవేళ ప్రాంతీయవాదం ముసుగులో దాడి చేస్తే అదే ప్రాంతీయవాదాన్ని వినిపించిన జనసేన నేతలతో తిప్పి కొడతారు. మేధావుల ముసుగులో బురదజల్లే ప్రయత్నం చేస్తే.. అదే మేధావి వర్గంతో తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు. అలా అన్ని వర్గాలతో సేన గళం ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్.
* అటువంటి వాటికి చెక్..
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాగేశ్వర్ కు మద్దతుగా తెలంగాణ ముసుగులో కొందరు మేధావులు, జర్నలిస్టులు వ్యతిరేక గళం వినిపించారు. పవన్ పై వ్యక్తిగత దాడి చేశారు. అయితే పవన్ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నందున ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం అనేది సర్వసాధారణమే. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు పడుతున్నారు. ఇటువంటి వాటిని ఎదుర్కొనేందుకు సేన గళంను రంగంలోకి దించారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
