India vs Pakistan : మనం ఏదైనా పనిచేస్తున్నప్పుడు.. అందులో అనుకొని అవాంతరాలు ఎదురైనప్పుడు.. సహజంగానే విక్టిమ్ కార్డు వాడుతుంటాం. ఫలానా పనిచేస్తుండగా.. అవాంతరం ఎదురయింది.. అందువల్లే పని చేయలేకపోయామని చెబుతుంటాం.
ఎటువంటి పనిచేయకపోయినప్పటికీ.. దాని గురించి కనీసం ఆలోచించకపోయినప్పటికీ.. విక్టిమ్ కార్డు వాడితే.. దానిని ఏమనుకోవాలి.. ఒకవేళ అటువంటి వ్యవహారానికి పేరు పెడితే అది కచ్చితంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అవుతుంది.
ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో టీమిండియా వేదికగా మ్యాచ్ లు ఆడబోమని బంగ్లాదేశ్ ప్రకటించింది. బంగ్లాదేశ్ క్రికెటర్ ను ఐపీఎల్ నుంచి బిసిసిఐ తొలగించింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న బంగ్లాదేశ్ 20 20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. భారత దేశంలో తమ ఆటగాళ్లకు భద్రత లేదని కుంటి సాకులు చెప్పింది.
బంగ్లాదేశ్ మాటకు వంత పాడిన పాకిస్తాన్.. ఏకంగా భారత జట్టుతో మ్యాచ్ ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఐసీసీ రంగంలోకి దిగిన తర్వాత అనేక గొంతెమ్మ కోరికలను కోరింది. కానీ వాటిని ఐసిసి ఒప్పుకోలేదు. పైగా మరింత ఒత్తిడి తీసుకురావడంతో పాకిస్తాన్ తలవంచక తప్పలేదు. టీమిండియాతో క్రికెట్ ఆడక తప్పలేదు.
కొలంబోలో ఆదివారం టీమ్ ఇండియాతో పాకిస్తాన్ ఆడింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ చేసిన గొప్ప ప్రదర్శన ఏదైనా ఉందంటే తొలి ఓవర్లో అభిషేక్ శర్మ వికెట్ తీయడం.. ఆ తర్వాత ఏ దశలో కూడా భారత జట్టుకు పాకిస్తాన్ పోటీ ఇవ్వలేకపోయింది. కనీసం భారత ప్లేయర్లు ఇబ్బంది పడేవిధంగా వ్యవహరించలేకపోయింది.
బౌలింగ్ కు సహకరించే మైదానంపై పరుగులు ఇచ్చేసింది. స్థిరమైన ఆట ప్రదర్శించే సమయంలో వికెట్లు పడేసుకుంది. తద్వారా భారీ ఓటమిని మూటగట్టుకుంది. పాకిస్తాన్ జట్టు ఓటమిని చూసి ఆ జట్టు అభిమానులు మధ్యలోనే మైదానం నుంచి వెళ్లిపోయారు. చివరికి నక్వి కూడా దొడ్డిదారిన తన కారులో హోటల్ గదిలోకి వెళ్ళాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్ జట్టు వల్ల సొంత అభిమానులే తల ఎత్తుకోలేని పరిస్థితి.. అటువంటి పాకిస్తాన్ చెట్టు టీం ఇండియాకు గట్టి పోటీ ఎలా ఇస్తుంది.. గట్టి పోటీదారు ఎలా అవుతుంది..
ఆడ లేక మద్దెల ఓడు అన్నట్టుగా.. టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వలేక.. పాకిస్తాన్ మధ్యలోనే చేతులెత్తేసింది. ఇంతటి సో కాల్డ్ ఆట తీరు ప్రదర్శించి.. పాకిస్తాన్ విమర్శల పాలు కావడం మాత్రమే కాదు.. ఉన్న ఆ కాస్త పరువు కూడా పోగొట్టుకుంది. అసలే పాకిస్తాన్ అంటే ఒంటి కాలు మీద లేచే టీమ్ ఇండియా అభిమానులు.. ఆదివారం నాటి ఓటమితో మరింత రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో పాకిస్తాన్ జట్టు ఇజ్జత్ మొత్తం తీసేస్తున్నారు.