Pakistan diplomacy : అధిక స్నేహం ప్రాణగండం అంటారు.. ఇప్పుడు ఈ సామెత పాకిస్తాన్ దేశానికి అచ్చు గుద్దినట్టు సరిపోతోంది.. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు అమెరికా అండతో పాకిస్తాన్ బతికి బట్ట కట్టింది. లేకుంటే ఇండియా చేతిలో చావు దెబ్బ తినేదే. ఆ తర్వాత అమెరికాతో గట్టిగా అంటకాగడం మొదలుపెట్టింది పాకిస్తాన్. దీనికి తోడు పాకిస్తాన్ సర్వ సైన్యాధ్యక్షుడు మునీర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు దగ్గరగా ఉండడం మొదలుపెట్టారు. ఆ మధ్య పాకిస్తాన్ లో దొరికే విలువైన వనరులను అమెరికా కంపెనీలకు దోచిపెట్టడానికి ఆయన సిద్ధమయ్యారు.
అమెరికాకు దగ్గరగా కావడంతో.. ఏదైనా చేసుకోవచ్చు.. ఏమైనా జరపొచ్చు అని పాకిస్తాన్ భావించింది . అమెరికా అండ చూసుకొని భారత్ మీద పెత్తనం సాగించవచ్చు.. భారతదేశాన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టవచ్చని పాకిస్థాన్ అనుకుంది. కానీ క్షేత్రస్థాయిలో జరిగింది వేరు. పాకిస్తాన్ దేశాన్ని అమెరికా పూచిక పుల్లతో పక్కనపెట్టింది. కూరలో కరివేపాకు మాదిరిగా తీసి పడేసింది. అమెరికా తీరే అలా ఉంది అనుకుంటే.. చివరికి చైనా కూడా జాడిచ్చి తన్నింది.
చైనాతో కూడా పాకిస్తాన్ అంట కాగడం మొదలుపెట్టింది. పైగా పాకిస్తాన్ దేశానికి చైనా అనేక విషయాలలో అండదండలు అందిస్తోంది. ఆర్థికంగా సపోర్ట్ చేస్తోంది. ఇంకా కొన్ని విషయాలలో కీలకంగా వ్యవహరిస్తోంది. పాకిస్తాన్తో కలిసి చైనా అనేక రకాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్వహిస్తోంది.
ఇటీవల పాకిస్తాన్ బాలుచ్ లిబరేషన్ ఉద్యమకారులను ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని తీర్మానం చేసింది. దీనికి చైనా సపోర్ట్ చేసింది. అయితే అమెరికా తన వీటో అధికారంతో ఈ తీర్మానాన్ని పక్కన పెట్టింది. అసలు వాళ్ళ మీద ఉగ్రవాదులు అని ముద్ర వేయడానికి ఎటువంటి ఆధారం లేదని అమెరికా వాదించింది. దీంతో పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఇక్కడ పాకిస్తాన్ దేశానికి అనుకూలంగా జై కొట్టిన చైనా.. మరో విషయంలో మాత్రం చావు దెబ్బతీసింది. కీలకమైన ఎయిర్ బేస్ లు.. దాచిన మిస్సైల్స్.. చేపడుతున్న అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన ఫోటోలను బయటపెట్టింది.
ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియకుండా పాకిస్తాన్ అత్యంత రహస్యంగా చేస్తోంది. దీంతో పాకిస్తాన్ అసలు రంగు బయటపడింది. అటు అమెరికా ఇబ్బంది పెట్టడం..ఇటు చైనా దూరం పెట్టడంతో పాకిస్తాన్ పరిస్థితి అడ కత్తెరలో ఇరుక్కున్నట్టుగా మారింది. మొన్నటిదాకా అమెరికా అండ చూసుకొని పాకిస్తాన్ విర్రవీగింది. చైనా సపోర్ట్ చూసుకొని మీసాలు తిప్పేసింది. కానీ ఆ రెండు దేశాలు పాకిస్తాన్ ను ఆటలో అరటిపండు మాదిరిగా వాడుకుంటున్నాయని ఇప్పుడు ఆ దేశ పరిపాలకు తెలిసింది. అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు చింతించి లాభం లేదు. ఇప్పుడు చేయాల్సింది కేవలం పిసుక్కోవడమే..
