Moinabad farmhouse murders : వారిద్దరూ మహిళలు. ఇటీవల ఇంట్లో నుంచి (వేరువేరుగా) బయటికి వెళ్లిన వారిద్దరూ మళ్లీ ఇంటికి రాలేదు. ఏం జరిగిందో తెలియదు. కుటుంబ సభ్యులు అన్నిచోట్లా వెతికారు. బంధువులకు ఫోన్ చేసి కనుక్కున్నారు. అయినప్పటికీ ఉపయోగం లేదు. చివరికి వారు వినకూడని వార్త విన్నారు. జరగకూడని దారుణాన్ని చూశారు.
తెలంగాణ రాష్ట్రంలోని తాండూరులో ఇద్దరు మహిళలు కనిపించకుండా పోయారు. వారిద్దరూ వృద్ధులే. చివరికి వారు విగత జీవులుగా మారారు. బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఒకరు.. యాలాల్ పరిధిలో మరొకరు అదృశ్యమయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్కట్ట అటవీ ప్రాంతంలో వారిద్దరి విగత దేహాలు కనిపించాయి. అయితే వారిద్దరిని తాండూర్ నుంచి మొయినాబాద్ తీసుకువచ్చి.. అక్కడ ఎవరూ లేని ప్రదేశంలో దారుణానికి పాల్పడి ఉంటారని.. తర్వాత వారి విగతదేహాలను పూడ్చిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
చనిపోయిన వారిలో బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడి ఆయా ఆబేద, తాండూరు ఇందిరమ్మ కాలనీ చెందిన మహబూబ్ బేగం గా పోలీసులు గుర్తించారు. అయితే నిందితులు ఒకేసారి ఈ ఘోరానికి పాల్పడలేదు. సరిగా రెండు నెలల క్రితం ఒక వృద్ధురాలిని అంతం చేశారు. ఆమె విగత దేహాన్ని పూడ్చిపెట్టారు. అనంతరం మరో వృద్ధురాలిని కూడా ఐదు రోజుల క్రితం అంతం చేశారు. ఆమె మిగతాదేహాన్ని కూడా అలానే పూడ్చిపెట్టారు.
ఈ వ్యవహారంలో చనిపోయిన ఒక మహిళ భర్త హస్తంతో పాటు.. స్థానికంగా ఒక ఫామ్ హౌస్ సెక్యూరిటీ గార్డ్ గా వ్యవహరించే వ్యక్తి పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. వారిని అంతం చేసిన తర్వాత విగత దేహాలను మోయినాబాదులోని ఓ వ్యవసాయ క్షేత్రం వెనుక వైపు ఉన్న ప్రాంతంలో పూడ్చిపెట్టారు.. అయితే ఎందుకు వారిని అంతం చేశారు?.. డబ్బు కోణంలోనా? ఇంకా మరి ఏదైనా కారణం ఉందా? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
