Visakhapatnam Steel Plant controversy : ఇటీవల వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం.. ఆస్తి నష్టం చోటుచేసుకుంది. గాయపడిన కార్మికులు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.. ఈ ఘటన జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించింది.. మృతులకు వెంటనే పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంది. గాయపడిన వారి వైద్య చికిత్సలు.. పరిహారం అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది.. ఆ దిశగా వేగంగా అడుగులు వేసింది. చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది.
ఈ ఘటన జరిగిన తర్వాత వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్లారు. మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన ఆయన రాజకీయంగా బలప్రదర్శన చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు ఎల్జీ కంపెనీ ప్రమాదం జరిగినప్పుడు తాము వ్యవహరించినట్టుగా.. కూటమి ప్రభుత్వం పని చేయడం లేదని ఆరోపించారు.
వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు, పవన్ కుట్ర చేశారని.. ఆ ఫ్యాక్టరీని కార్మికులు ఉద్యమాలు చేసి కాపాడుకున్నారని జగన్ వ్యాఖ్యానించారు.. అంతేకాదు, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ భూములను ఆక్రమించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చిన కార్యక్రమాన్ని పక్కనపెట్టి.. అక్కడ కూడా రాజకీయాలను చేశారు జగన్. చివరికి తన పార్టీ కార్యకర్తలను భారీగా మోహరింపజేసి.. జై జగన్ అంటూ నినాదాలు చేయించారు.. దీంతో ఆ పరామర్శ కార్యక్రమం కాస్త రాజకీయ కార్యక్రమంగా మారిపోయింది.
జగన్ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మృతుల కుటుంబాలను పరామర్శించి వెళ్లిన తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్.వి.సుబ్రహ్మణ్యం కొన్ని విషయాలను బయటపెట్టారు. అమరావతి విషయంలో మొదటి నుంచి కూడా జగన్ ఒక రకమైన భావనతోనే ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో రాజధాని విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం రోడ్లు వేయలేదు. భవనాలు నిర్మించలేదు. రాజధాని నిర్మాణం అడుగు ముందుకు పడకపోవడంతో అక్కడ ముళ్ళకంప చెట్ల విపరీతంగా పెరిగిపోయాయి.. రోడ్లు మొత్తం నాశనం అయ్యాయి. అమరావతిని పక్కనపెట్టిన జగన్.. నాడు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని మూసివేసి.. ఆ భూముల్లో రాజధాని నిర్మించాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని ఎల్వి సుబ్రహ్మణ్యం తో చెప్పారు. దీనిని ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యతిరేకించారు. “అలా కుదరదు.. అలా చేస్తే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనేక ఉద్యమాల ద్వారా సాగింది. ఆ ఉద్యమాలను అపహస్యం చేసే విధంగా ప్రయత్నిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని” ఎల్వి సుబ్రహ్మణ్యం హెచ్చరించారు.
దానికి జగన్ ఒప్పుకోలేదు..”నువ్వేంటన్న ప్రతిదానికి అడ్డుపడుతుంటావ్. ఏం చెప్పినా సరే వినిపించుకోవు. పైగా కాదంటావ్. కుదరదంటావ్.. ఇలా అయితే కష్టమన్న నీతో” అని సుబ్రహ్మణ్యం తో జగన్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బయటికి వచ్చేసారు. స్టీల్ ఫ్యాక్టరీ భూముల్లో రాజధాని నిర్మించాలని జగన్ అనుకున్నప్పటికీ.. అది సాధ్యం కాలేదు. చివరికి అక్కడ కార్మికులు ఉద్యమాలు చేయడంతో జగన్ తన ఆలోచన విరమించుకున్నారు. చివరికి రిషికొండ మీద ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టి.. కొంతలో కొంత తన అహాన్ని నెగ్గించుకున్నారు. నాడు స్టీల్ ఫ్యాక్టరీ భూముల్లో రాజధాని నిర్మిస్తానని జగన్ చెప్పిన విషయాన్ని ఇటీవల ఒక టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్లో ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పారు..

