Jewar Airport Farmers: నడమంత్రాన సిరి.. నరం మీద పుండు మనిషిని నిలవనీయకుండా చేస్తాయని అంటారు. ఆ సామెతకు అర్థం ఏమిటో ఈ రైతులను చూస్తే తెలిసింది. వాస్తవానికి వారంతా కొన్ని సంవత్సరాల క్రితం రైతులు. తమ భూముల్లో పంటలు పండించేవారు. పంట ఉత్పత్తులను విక్రయించగా వచ్చిన డబ్బుతో జీవనం కొనసాగించేవారు. వ్యవసాయం చేస్తున్నప్పటికీ వారేమీ గొప్ప శ్రీమంతులు కాదు. అలాగని బికారీలు కూడా కాదు.
వారు ఊహించని విధంగా రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. వారికి ఏదో జాక్పాట్ లభించలేదు. లాటరీ కూడా తగలలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం జెవార్ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. దీనికోసం అక్కడి రైతుల భూములను సేకరించింది. పరిహారంలో భాగంగా ఒక్కో ఎకరానికి 20 లక్షలు చెల్లించింది. విమానాశ్రయ నిర్మాణానికి దాదాపు 12 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వం భారీగా డబ్బులు చెల్లించిన నేపథ్యంలో రైతులకు ఏం చేయాలో తెలియలేదు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో అర్థం కాలేదు. దీంతో వారంతా విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు. ఖరీదైన కార్లు కొనుగోలు చేశారు. సర్జరీ జీవితాన్ని అనుభవించడం మొదలుపెట్టారు. కొంతకాలానికి చేతిలో ఉన్న డబ్బు మొత్తం ఖర్చయిపోయింది. ఇప్పుడు కనీసం ఫోన్ కూడా రిపేర్ చేయించుకోవడానికి వారి దగ్గర డబ్బులు లేవు.
అందరి వద్ద కూడా విలాసవంతమైన భవనాలు .. వాహనాలు ఉండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. దీంతో అక్కడి రైతులు తమ బాధను చెప్పుకుంటున్నారు . ఇక్కడ రైతుల పరిస్థితి గురించి తెలిసిన జాతీయ మీడియా కథనాలను ప్రసారం చేసింది . “రైతులకు భారీగా డబ్బు వచ్చింది. వారంతా కూడా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత లగ్జరీ లైఫ్ లో భాగంగా ఖర్చు పెరిగిపోవడంతో డబ్బులు పూర్తిగా అయిపోయాయి. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం ఖర్చు కావడంతో ఏం చేయాలో వారికి తెలియడం లేదు. అందువల్లే కనీసం ఫోన్లు కూడా రిపేరు చేయించుకోలేని స్థితిలో వారు కూరుకుపోయారని” జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మరోవైపు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం నిర్మాణ సమయంలో నిర్వాసిత రైతులకు కూడా ఇదేవిధంగా ప్రభుత్వం పరిహారం అందించింది. కానీ ఆ పరిహారంతో చాలామంది వాహనాలు కొనుగోలు చేశారు. ఖరీదైన భవనాలు నిర్మించారు. చివరికి చేతిలో చిల్లిగవ్వలేక ఇప్పుడు వేరే వేరే పనులు చేసుకుంటున్నారు. ఖరీదైన వాహనాలను నిర్వహించే సామర్థ్యం లేక వాటిని అమ్మేశారు. నివాసాలు కూడా అమ్మాలని అనుకున్నప్పటికీ.. వాటిని కొనేవారు లేకపోవడంతో మిన్నకుంటున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రైతుల పరిస్థితి కూడా పోలవరం నిర్వాసితుల మాదిరిగానే మారిపోయిందని నెట్టింట చర్చ నడుస్తోంది.
