Iran vs USA conflict 2026 : పశ్చిమాసియా యుద్ధం మొదలై 40 రోజులు కావొస్తోంది. ఇన్ని రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ సమర్థవంతంగా ఎదుర్కొంది. ప్రతీకార దాడులతో అమెరికా అనుకూల గల్ఫ్ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. అమెరికా స్థావరాలు, యుద్ధవిమానాలను టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు పదాతి దళాలను దించుతామని బెదిరిస్తున్నా ఇరాన్ తలొగ్గడం లేదు. దీంతో ట్రంప్ చర్చలు అంటూ కొత్త అంశం తెరపైకి తెచ్చాడు. దానికి ఇరాన్ ససేమిరా ఒప్పుకోలేదు. తమ కండీషన్లు అంగీకరించాలని షరతు పెట్టింది. ఇక ఇప్పుడు టర్కీ, పాకిస్తాన్, అజర్బైజాన్ జరిపిన మధ్యవర్తిత్వంతో 45 రోజుల సీజ్ఫైర్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కానీ దీనికి కూడా ఇరాన్ అవకాశం ఇవ్వడం లేదు. అమెరికా ప్రతిపాదించిన 15 సూత్రాల శాంతి ప్రణాళికను ఇరాన్ ’మోసపూరితం’గా అభివర్ణించింది. దానికి బదులుగా తమ సొంత షరతుల జాబితాను ముందుపెట్టింది.
ఇరాన్ షరతులు..
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిపై తమ పూర్తి నియంత్రణను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని డిమాండ్ చేసింది. అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆర్థిక, చమురు ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని కోరింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తమ దేశానికి జరిగిన నష్టానికి భారీ మొత్తంలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా హామీ ఇవ్వాలని, అణుకేంద్రాలు, సైనిక స్థావరాలపై దాడులు ఆపాలని కోరింది. యురేనియం శుద్ధిని నిలిపివేయాలని, అణు నిల్వలను తొలగించాలని అమెరికా కోరగా, దానికి ఇరాన్ నిరాకరించింది. ‘మా షరతులు నెరవేరినప్పుడు, మేం నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే ఈ యుద్ధం ముగుస్తుంది. అంతేకానీ అమెరికా కోరుకున్నప్పుడు కాదు‘ అని ఇరాన్ సీనియర్ అధికారి స్పష్టం చేశారు.
ట్రంప్ మాస్ వార్నింగ్..
ఇరాన్ తిరస్కరణపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 6న హార్మూజ్ జలసంధి తెరవడానికి విధించిన గడువు ముగియనున్న నేపథ్యంలో ఆయన హెచ్చరికలు మరింత ఘాటుగా మారాయి. హార్మూజ్ జలసంధిని మరో 48 గంటల్లో బేషరతుగా తెరవాలని ట్రంప్ ఆదేశించారు. ఒకవేళ ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే, ఆ దేశంలోని అన్ని మౌలిక సదుపాయాలను (విద్యుత్ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, రవాణా వ్యవస్థ) పేల్చివేస్తామని బెదిరించారు. ఇరాన్ చమురు క్షేత్రాలను స్వాధీనం చేసుకుంటామని, దీనివల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుందని హెచ్చరించారు. ‘హార్మూజ్ జలసంధిని తెరవండి రా పిచ్చి వెదవల్లారా.. లేదంటే నరకానికి పంపిస్తాం’ అంటూ ట్రంప్ పరుష పదజాలంతో హెచ్చరికలు జారీ చేశారు. ఇదే సమయంలో ‘ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకదానితో సైనిక పోరాటం చేస్తున్నాం‘ అని ట్రంప్ అంగీకరించడం విశేషం.
ఇరువైపులా భీకర దాడులు..
దౌత్య చర్చలు జరుగుతున్నప్పటికీ, యుద్ధం మాత్రం ఆగలేదు. ఇస్ఫహాన్, కరాజ్, టెహ్రాన్లపై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపించాయి. ఇరాన్ అణ్వాయుధ తయారీ కేంద్రాలను ధ్వంసం చేయడం లక్ష్యంగా ఈ దాడులు సాగాయి. ఇరాన్ కూడా అమెరికా కె–10 ఫైటర్ జెట్ను కూల్చివేసింది. మరో విమానంపై కూడా దాడి చేసినట్లు సమాచారం. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ చమురు రవాణా పూర్తిగా స్తంభించింది. దీనివల్ల అమెరికా, భారత్, చైనా వంటి దేశాలకు భారీ నష్టం వాటిల్లుతోంది.
ఇరాన్ తిరస్కరణ, ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో యుద్ధం మూడు మార్గాల్లో సాగే అవకాశం ఉంది. ట్రంప్ హెచ్చరికల ప్రకారం, అమెరికా ఇరాన్ మౌలిక సదుపాయాలపై వినాశకర దాడులు చేయవచ్చు. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చవచ్చు. ఇరాన్ షరతులు అంగీకరించకపోతే, యుద్ధం ఇంకా నెలల తరబడి సాగే ప్రమాదం ఉంది. ఇది ప్రపంచ చమురు ధరలను మరింత పెంచేస్తుంది. గడువు ముగిసేలోపు ఇరాన్ కొంత రాజీపడి, హార్మూజ్ తెరవడానికి అంగీకరించవచ్చు.