Amaravati Capital Bill: ఏపీ రాజధాని అమరావతికి( Amravati capital ) చట్టబద్ధత లభించింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం తర్వాత రాష్ట్రపతి భవన్ కు చేరుకుంది. ఈ బిల్లును పరిశీలించిన అనంతరం న్యాయ నిపుణులతో సంప్రదింపుల తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సబ్ సెక్షన్ 2 లో అమరావతిని రాజధానిగా పేర్కొంటూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా పేర్కొన్నారు. దీంతో గత కొంతకాలంగా ఉన్న గందరగోళానికి తెరపడింది. అమరావతి ఏకైక రాజధానిగా గుర్తించబడింది.
* పార్లమెంట్ ఆమోదం తర్వాత..
ఇటీవల అమరావతిని ఏపీకి రాజధానిగా చేస్తూ చట్టబద్ధత కల్పించేందుకు బిల్లును పార్లమెంటు( parliament ) ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. దాదాపు 5 గంటల పాటు చర్చించిన అనంతరం బిల్లును ఆమోదించారు. ఎలాంటి సవరణలు ప్రతిపాదించకుండానే ఈ బిల్లును పార్లమెంటులో ఆమోదించడం విశేషం. అదే బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఆమె న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. ఎటువంటి అభ్యంతరాలు, ఇబ్బందులు లేకపోవడంతో ఆ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారు. దీంతో కేంద్ర న్యాయశాఖ అమరావతి రాజధానిగా పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన 2024 జూన్ 2 నుంచి అమరావతి రాజధానిగా వర్తింపు చేసి నోటిఫికేషన్ జారీ చేయడం విశేషం.
* ఏ రాష్ట్ర రాజధానికి లేనివిధంగా..
వాస్తవానికి ఏ రాష్ట్ర రాజధానికి కూడా చట్టబద్ధత లేదు. అటువంటిది ఏపీ నుంచి అమరావతికి కల్పించడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఏకాభిప్రాయంతో చంద్రబాబు( CM Chandrababu) అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. అందుకు అన్ని రాజకీయ పక్షాలు కూడా మద్దతు పలికాయి. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అదే పేరుతో అమరావతిని నిర్వీర్యం చేశారు. మూడు రాజధానులను కట్టలేకపోయారు. అందుకే ఏపీ ప్రజలు ఆగ్రహంతో 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. కూటమి అధికారంలోకి రాగా మళ్లీ అమరావతిలో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.. ఇప్పుడు కూడా రకరకాల ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. గత అనుభవాల నేపథ్యంలో చట్టబద్ధత కల్పించాలని అమరావతి రైతులు కోరారు. సీఎం చంద్రబాబు కేంద్రానికి నివేదించడంతో చట్టబద్ధతకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
* కేంద్రం సానుకూలతతో..
అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. ఆపై ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. ఏపీలో కూటమిలో బిజెపి ఉంది. ఈ పరిణామాల క్రమంలో రాష్ట్రం నుంచి వెళ్తున్న సిఫార్సులకు పెద్దపీట వేస్తోంది కేంద్రం. అందుకే చంద్రబాబు కోరిందే తడవుగా అమరావతికి చట్టబద్ధత కల్పించింది. వాస్తవానికి ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. కానీ స్వల్ప కాలంలోనే ముగించి ఏపీ పై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది కేంద్రం. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లుపై సంతకం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.