India T20 World Cup : ప్రమాదకరమైన ఆస్ట్రేలియా ఉంది. భీకరమైన ఇంగ్లాండు ఉంది. సంచలనాల దక్షిణాఫ్రికా ఉంది. విభిన్నమైన న్యూజిలాండ్ ఉంది. ప్రకంపనలు సృష్టించే వెస్టిండీస్ ఉంది.. ఇన్ని జట్లు ఉన్నప్పటికీ మరికొద్ది రోజుల్లో జరగబోయే టి20 వరల్డ్ కప్ లో టీమిండియానే టైటిల్ ఫేవరెట్.. స్వదేశంలో ఆడుతోంది కాబట్టి ఈ మాట అనడం లేదు.. టీమిండియా విజయం సాధిస్తుంది.. ట్రోఫీ అందుకుంటుంది అని చెప్పడానికి ప్రధాన కారణం మెన్ ఇన్ బ్లూ సాధించిన గణాంకాలు.
టీమిండియా 2023 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు t20 లలో ఏకంగా 48 విజయాలు సాధించింది. 2023 అక్టోబర్ నుంచి నిన్నటి న్యూజిలాండ్ సిరీస్ వరకు టీమ్ ఇండియా మొత్తం 56 మ్యాచులు ఆడింది. ఇందులో భారత్ 48 విజయాలు (సూపర్ ఓవర్ ఫలితాలను మినహాయిస్తే) అందుకుంది. ఆస్ట్రేలియా కంటే కూడా టీమిండియా ముందు వరసలో ఉంది. ఆస్ట్రేలియా 28 విజయాలు, 13 ఓటములతో కొనసాగుతోంది.
పరుగులపరంగా భారత్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. 9.69 రన్ రేట్ తో పరుగులు చేస్తోందంటే భారత్ బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 62 మ్యాచులలో 20 సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించింది టీమిండియా. ఈ జాబితాలో వెస్టిండీస్ 61 మ్యాచ్లలో 13 సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసి రెండవ స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ 51 మ్యాచ్లలో పదిసార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసి మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ జట్టు 38 మ్యాచ్లలో ఆరుసార్లు, ఆస్ట్రేలియా 44 మ్యాచ్లలో 8 సార్లు, వెస్టిండీస్ 61 మ్యాచ్లలో 13 సార్లు, న్యూజిలాండ్ 51 మ్యాచ్లో పదిసార్లు, సౌత్ ఆఫ్రికా 46 మ్యాచులలో ఆరుసార్లు, పాకిస్తాన్ 68 మ్యాచులలో ఆరుసార్లు, జింబాబ్వే 63 మ్యాచ్లలో పదిసార్లు, శ్రీలంక 44 మ్యాచ్లలో ఐదుసార్లు, ఆఫ్ఘనిస్తాన్ 44 మ్యాచ్లలో నాలుగుసార్లు 200 లేదా అంతకంటే పరుగులు చేశాయి.
ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఐదు టి20 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ మూడు సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసింది. చివరి మ్యాచ్లో అయితే టీమిండియా ఏకంగా 271 పరుగులు చేసింది. ఇక మూడో మ్యాచ్లో అయితే కేవలం 10 ఓవర్లలో 154 రన్స్ టార్గెట్ ను చేజ్ చేసింది టీమిండియా. ఈ సిరీస్ లో టీమిండియా రన్ రేట్ 12.35. టాప్ 12 జట్లలో మూడు లేదా అంతకంటే ఎక్కువ టి20 మ్యాచ్ లు జరిగిన సిరీస్ లో భారత జట్టుకు ఇది రెండవ అత్యుత్తమం. భారత్ అక్టోబర్ 2024 లో బంగ్లాదేశ్ పై 12.54 రన్ రేట్ తో పరుగులు చేసింది.