తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు ఎట్టకేలకు విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు పోలీసులు 41ఏ సీఆర్ పీసీ కింద నోటీసులు అందించి చింతమనేనిని విడుదల చేశారు. నిన్న విశాఖ జిల్లా చింతపల్లి వద్ద పోలీసులు చింతమనేని అదుపులోకి తీసుకుని రాత్రంతా అక్కడే ఉంచారు. ఉదయం చింతపల్లి నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు తరలించారు. రెండు రోజుల కిందట పెట్రో ధరల పెంపును నిరసిస్తూ చింతమనేని ఆందోళన చేపట్టారు. దెందులూరులో జరిగిన ఆందోళన కార్యక్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై ఒక వేడుకలో పాల్గొనడానికి వెళ్లిన చింతమనేనిని పోలీసులు అరెస్టు చేశారు.