Desk Journalists Accreditation : డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం సవరణ జీవో జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పలు జిల్లాల సమాచార, పౌర సంబంధాల అధికారుల (డీపీఆర్వోలు) నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రక్రియ ముందుకు సాగడం లేదని డెస్క్ జర్నలిస్టుల సంఘం (డీజేఎస్) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా డీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ కొన్ని జిల్లాల్లో డీపీఆర్వోలు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఫలితంగా పలు జిల్లాల్లో డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదని తెలిపారు. దీంతో అర్హులైన జర్నలిస్టులు తీవ్ర అయోమయం, ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.
మీడియా అకాడమీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన ప్రధాన డిమాండ్లలో దివ్యాంగ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ల జారీలో ప్రత్యేక కోటా కల్పించడం, సెంట్రల్ డెస్క్లలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కేటాయించే కార్డుల సంఖ్యను పెంచడం వంటి అంశాలు ఉన్నాయి.
డీజేఎస్ ప్రతినిధుల విజ్ఞప్తులపై స్పందించిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అన్ని అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా దివ్యాంగ జర్నలిస్టుల ప్రత్యేక కోటా అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపారు. అలాగే జీవో అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న జిల్లాల డీపీఆర్వోల వ్యవహారంపై సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్తో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో డీజేఎస్ రాష్ట్ర ప్రతినిధులు రాజారాం, రమేశ్, సత్యప్రసాద్, వెంకట్ రమణ, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా మంగళవారం ఐఅండ్పీఆర్ కమిషనరేట్లో రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఇంకా అక్రెడిటేషన్ కార్డులు పొందని డెస్క్ జర్నలిస్టులందరూ హాజరై కమిటీ సభ్యులకు తమ వినతిపత్రాలు అందజేయాలని డీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో కమిషనరేట్కు తరలిరావాలని ఆయన కోరారు.
