Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ కూటమిలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని బిజెపి ప్రయత్నిస్తోంది. మరోవైపు భారత రాష్ట్ర సమితి సైతం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న కసితో కాంగ్రెస్ ఉంది. ఈ తరుణంలో వేరువేరుగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం ఖాయం. అందుకే అక్కడ కూటమిలు రంగంలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం, వామపక్షాలు జతకడితే.. బిజెపి, భారత రాష్ట్ర సమితి కూటమి కట్టే ఛాన్స్ ఉంది.. అందుకే టిడిపిని యాక్టివ్ చేసి పొత్తులో భాగంగా ఓట్లు, సీట్లు పొందాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.
* చెక్కు చెదరని అభిమానం..
ప్రస్తుతానికి తెలంగాణకు పార్టీ అధ్యక్షుడు లేరు. ఒకరిద్దరు నేతలు యాక్టివ్ గా పని చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు మాత్రం జరగడం లేదు. గ్రేటర్ తో పాటు ఖమ్మం, నల్గొండ లాంటి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఉన్నారు. ప్రజాదరణ కూడా ఎక్కువగా ఉంది. అందుకే పార్టీని యాక్టివ్ చేసి.. ఏదో ఒక కూటమిలో చేరి.. పొత్తులో భాగంగా పోటీ చేస్తే సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. తెలంగాణలో పార్టీ పూర్వవైభవం సాధించే స్థితికి రానుంది. అందుకే చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకంతో పాటు మంత్రి లోకేష్ కు అక్కడ కీలక బాధ్యతలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
* టిడిపిలోకి వచ్చేందుకు..
గులాబీ పార్టీలో చాలామంది నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఆ పార్టీలో ఉన్న 80 శాతం మంది పూర్వాశ్రమం తెలుగుదేశం. అందుకే తెలంగాణలో టిడిపిని యాక్టివ్ చేస్తే పార్టీలోకి వచ్చేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశారు. మాజీ మంత్రి బాబు మోహన్ సైతం పార్టీలోకి వచ్చేందుకు సిద్ధపడ్డారు. ఖమ్మం నుంచి బలమైన నేతగా ఉన్న నామా నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు వంటి పెద్ద పెద్ద నేతలు వచ్చి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాదులో సైతం చాలామంది నేతలు టిడిపి వైపు చూస్తున్నారు. అందుకే చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి తెలంగాణపై వారంలో ఒకరోజు ఉండాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ కు సూచించినట్లు తెలుస్తోంది. ఒకరోజు సమయం కేటాయించడంతోపాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై లోకేష్ దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.







