Chandrababu Chintamaneni : కొంతమంది టీడీపీ నేతల వ్యవహార శైలి అధినేత చంద్రబాబుకు ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల వ్యవహార శైలి చికాకు పెడుతోంది. ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా అని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాచుకుని కూర్చుంది. అందుకే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం అవకాశం ఇవ్వకండి అని సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేస్తూ వచ్చారు. కానీ రెండు పార్టీల్లోనూ ఎమ్మెల్యేలపై రోజురోజుకు ఆరోపణలు పెరుగుతున్నాయి. లైంగిక ఆరోపణలు రావడం, చాలామంది దూకుడుగా వ్యవహరిస్తుండడంతో… వారిని ఎలా కట్టడి చేయాలో కూడా తెలియడం లేదు. ప్రభుత్వ పెద్దలుగా వారు బాగానే పని చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. కూటమి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసేలోగా.. కొంతమంది వ్యవహార శైలి ఇబ్బందికరంగా మారింది.
* చింతమనేని హల్ చల్..
తాజాగా చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలి బయటపడింది. రోడ్డుపై అర్ధరాత్రి ఆయన హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వైసిపి ట్రాప్ లో పడి ప్రభాకర్ అలా చేశారని.. అందుకు కారణమైన టిడిపి నేతను పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. అంతకుముందు విజయవాడ ఎంపీ వర్సెస్ తిరువూరు ఎమ్మెల్యే అన్నట్టు పరిస్థితి ఉండేది. ఇద్దరు నేతల మధ్య విభేదాలు తారాస్థాయిలో కూడా కనిపించాయి. ఎంపీపై నేరుగా విమర్శలు చేశారు తిరువూరు ఎమ్మెల్యే.. ఏడాది కిందట అటవీ శాఖ ఉద్యోగులపై శ్రీశైలం టిడిపి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.. ఇలా చాలామంది ఎమ్మెల్యేల పనితీరు వివాదాస్పదంగా మారింది. ఇటువంటి వివాదాలు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఇరకాటంలో పడేస్తున్నాయి.
* చాలా రకాల ఆరోపణలు..
చాలా జిల్లాల్లో అధికార కూటమి ఎమ్మెల్యేలు అంతర్గతంగా అరాచకాలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆరోపణలతో పాటు వివాదాల్లో చిక్కుకుంటున్న వారు ఉన్నారు. వీరి విషయంలో ఎలా ముందుకెళ్లాలో చంద్రబాబుకు తెలియడం లేదు. ఒకటి మాత్రం నిజం. వీరిపై చర్యలు తీసుకోవడం లేదు. చాలా స్ట్రిక్ అడ్మినిస్ట్రేటర్ గా చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ ఇటువంటి వారితో దెబ్బతింటుంది. రాజకీయాల్లో మర్యాదస్తులుగా పేరుపొందిన చాలామంది సైతం ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నారు. వారి వ్యక్తిగత ప్రవర్తన పై అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. అయితే రాష్ట్రాన్ని ఏదో చేయాలన్న ఆలోచనతో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఉన్నారు. రాజకీయంగా వారికి సొంత పార్టీ నేతలతో ఇబ్బందులు వస్తుండడంతో ఎలా ముందుకు వెళ్లాలో తెలియడం లేదు.
* ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా..
సీఎం చంద్రబాబు వైఖరిలో స్పష్టమైన మార్పు ఉంది. గతానికి భిన్నంగా ఆయన వైఖరి ఉండి. వీలైనంతగా ప్రజలతో మమేకం కావడానికి నవ్వుతూ ప్రజల మధ్య ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారు. సొంత పార్టీ వారితో పాటు కూటమి ఎమ్మెల్యేలకు ఆయన ఎప్పటికప్పుడు హితబోధ చేస్తున్నారు. శాంతంగా ఉండండి.. వివాదాలకు దూరంగా ఉండండి.. ప్రజల మధ్య ఉండండి అని ఎమ్మెల్యేలకు పదేపదే చెబుతున్నారు. చాలామందికి ఈ విషయం అర్థం అవుతోంది. కానీ కొంతమంది ఎమ్మెల్యేలకు మాత్రం తత్వం బోధపడడం లేదు.
