Annamalai BJP resignation : బిజెపి కి తమిళనాడులో ఒక ఊపు తీసుకొచ్చిన నాయకుడు అన్నామలై. ఇతడు ఒక ఐపీఎస్ అధికారి. రాజకీయాల మీద ఆసక్తి.. తమిళ గడ్డకు ఏదైనా చేయాలి అనే ప్రేమతో తన సర్వీస్ కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రతి అంశం మీద లోతైన విశ్లేషణ చేయడం.. ప్రజా సమస్యల మీద మాట్లాడటం అన్నా మలై కి అలవాటు. అదే అతడిని తమిళనాడులో తిరుగులేని నాయకుడిగా చేసింది. వాస్తవానికి అన్నామలై లాంటి నాయకుడు మరొక పార్టీలో ఉంటే నెత్తిన పెట్టుకునేవి. కానీ, తమిళనాడులో బిజెపికి అది చేతకాలేదు. అధిష్టానానికి అర్థం కాలేదు.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తమిళనాడులో 13% ఓటు బ్యాంకు వచ్చిందంటే దానికి ప్రధాన కారణం అన్నామలై. ఎన్డీఏ కూటమి మొత్తానికి 17% శాతం ఓటు బ్యాంకు నమోదయింది. కానీ, 2026 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ అధిష్టానం అన్నామలై విషయంలో స్టాండ్ మార్చుకుంది. అన్నా డీఎంకే అధినేత “ఈపీఎస్” ఒత్తిడికి తలవంచి అన్నామలై ని బిజెపి అధ్యక్షుడి స్థానం నుంచి తొలగించింది. ఇది తమిళనాడులో కమలం పార్టీకి మొదటి దెబ్బ. ఆ తర్వాత అన్నా డీఎంకే చెప్పిన స్థానాలలోని బిజెపి పోటీ చేయాల్సి వచ్చింది. అవన్నీ అత్యంత బలహీనమైన స్థానాలు. పనికిమాలిన అన్నా డీఎంకే ఒత్తిడి వల్ల బిజెపి గెలిచే స్థానాలు కోల్పోవడంతో పాటు.. పోటీ చేసే స్థానాల్లో కూడా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంది.
బిజెపి తమిళనాడు అధ్యక్షుడు నుంచి మొదలు పెడితే తమిళ సై సౌందర రాజన్ వరకు తమ స్థానాలను మార్చకుండా అన్నా డీఎంకేతో లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అయితే వారు కూడా విజయం సాధించలేకపోయారు. చివరికి పార్టీని కూడా బతికించలేకపోయారు. ఎన్నికల్లో బిజెపికి రెండు శాతం ఓటు బ్యాంకు వచ్చిందంటే దానిని ఎలా అర్థం చేసుకోవాలో కమలం పెద్దలే నిర్ణయించుకోవాలి.
బిజెపి అధిష్టానం వ్యవహరించిన తీరుతో అన్నామలై తీవ్ర అంతర్మదనంలో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు బిజెపికి రాజీనామా చేసి.. ఆరు నెలల పాటు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకొని.. పార్టీని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే అన్నామలై బిజెపి పెద్దలకు వర్తమానం పంపినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంతవరకు బిజెపి పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరో వైపు తమిళనాడులో ద్రావిడ వాదానికి సంబంధం లేకుండా రాజకీయాలను రూపొందించాలని అన్నామలై భావిస్తున్నారు. బిజెపి ద్వారా దానిని భర్తీ చేయాలని అనుకున్నారు.
ఇటీవల ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడంతో ద్రావిడ వాదంతో తమిళ ప్రజలను పిచ్చోళ్లను చేసే ఆ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నాయి. చివరి నిమిషంలో విజయ్ మేల్కోవడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. ద్రావిడ వాద సెంటిమెంట్ నిత్యం రగిలిస్తూ.. తమిళ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నాయి ఆ రెండు పార్టీలు. వాటికి ప్రత్యామ్నాయంగా బిజెపిని రూపొందించాలని అన్నామలై భావించారు. కానీ అధిష్టానం తలతిక్క వ్యవహార శైలి వల్ల ఆయన పార్టీకే దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా బిజెపి అధిష్టానం మేల్కొంటుందా.. అన్నామలైకి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తుందా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
