Amaravati capital controversy : జగన్ కొత్త రాజధాని ప్రతిపాదనతో అమరావతి చుట్టుపక్క ప్రాంతాల్లో మరింత వ్యతిరేకత ప్రారంభం అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై. వైసీపీ ఆవిర్భావం తర్వాత మూడు ఎన్నికలు జరిగితే ఆ రెండు జిల్లాలు ఒకేసారి నమ్మాయి 2019లో. అది కూడా అమరావతి రాజధానిని కదిపించను అనే మాటను ప్రధానంగా నమ్మారు. ఆ నమ్మకంతోనే 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల స్టాండును తీసుకున్నారు అప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంట నడిచిన వర్గాలు సైతం యూటర్న్ తీసుకున్నాయి. 2024 ఎన్నికల్లో అమరావతి చుట్టుపక్కల ఉన్న ఉమ్మడి జిల్లాలన్నీ గుంప గుత్తిగా టిడిపి కూటమికి ఓటు వేసాయి. ఇప్పుడు మావిగన్ ప్రతిపాదన అనేది కేవలం ఒక చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అమరావతిపై విషం కక్కుతూ అలాంటి నిర్ణయం తీసుకున్నారని అటు విజయవాడ, ఇటు గుంటూరు ప్రజలు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పై సానుకూలత కంటే ఆ ప్రాంతాల్లో వ్యతిరేకత అధికంగా ఉంది.
* ఆహ్వానించని స్థానికులు
ఏదైనా ఒక ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తామంటే అక్కడి ప్రజలతో పాటు చుట్టుపక్కల వాళ్ళు ఆహ్వానిస్తారు. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రతిపాదిస్తూ తెరపైకి తెచ్చింది. దానిని అన్ని రాజకీయ పక్షాలు సమ్మతించాయి. గుంటూరు తో పాటు విజయవాడ ప్రజలు కూడా ఎంతగానో ఆనందించారు. అమరావతి తో ఈ రెండు నగరాలు అనుసంధానం జరిగి శరవేగంగా అభివృద్ధి చెందుతాయని భావించారు. దానిని ఆహ్వానించారు కూడా. అయితే ఆ ప్రాంతానికి రాజధానిగా గుర్తింపు ఇస్తే అదే ప్రజలు 2019 ఎన్నికల్లో టిడిపిని వ్యతిరేకించారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి సైతం అమరావతిని కొనసాగిస్తానని చెప్పడమే. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల స్టాండ్ తీసుకున్నారో.. అసలు తత్వం బోధపడింది ఆ ప్రాంతీయులకు. అప్పటినుంచి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డిని వారు వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
* మూడు రాజధానులు అన్నప్పుడు..
మూడు రాజధానుల స్టాండ్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు. వెనుకబాటు తనం రూపుమాపడానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సెలవిచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాటను విశాఖ ప్రజలు నమ్మలేదు. ఉత్తరాంధ్రవాసులు సైతం పెద్దగా ఆసక్తి చూపలేదు. 2024 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతీశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం- విజయవాడ- గుంటూరును కలుపుతూ మావిగన్ అనే కొత్త రాజధానిని తెరపైకి తెచ్చారు. కానీ ఇలా ప్రతిపాదన చేసిన ఆ మూడు ప్రాంతాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించలేదు. కనీసం హర్షం వ్యక్తం చేయడం లేదు. తద్వారా జగన్ తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పే ప్రయత్నం చేశారు ప్రజలు. ఎక్కడైనా రాజధాని మీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామంటే అక్కడి ప్రజలు సంబరపడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల విషయంలో స్థానికులు అలా చేయడం లేదు. పైగా వ్యతిరేకిస్తున్నారు కూడా.
