ముఖ్యమంత్రి జగన్ కు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నచ్చని పేరు ఏదైనా ఉందంటే.. అది రఘురామకృష్ణరాజు. చంద్రబాబు నాయుడు అనే పేరు కూడా సెకండ్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది. అంతలా ఇబ్బంది పెడుతున్నారు రఘురామ రాజు. అప్పటి వరకూ మీడియా స్టేట్ మెంట్లతో రాష్ట్రానికే పరిమితమైన రఘురామరాజు వ్యవహారం.. ఆయన అరెస్టుతో రచ్చ రచ్చగా మారి, దేశవ్యాప్తమైపోయింది. బలవంతంగా అదుపు చేద్దామని భావిస్తే.. పరిస్థితి రివర్స్ కొట్టిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే.. ఇప్పటికీ కంట్లో నలుసుగా వ్యవహరిస్తున్న ఆయనను ఎలా దెబ్బతీయాలా అని వైసీపీ ప్రయత్నాలు చేస్తూనే ఉందని అంటున్నారు. ఇందుకోసం కొత్త అస్త్రం ఒకటి సిద్ధం చేసిందని సమాచారం.
ఎంపీ రఘురామ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ మిషన్ ను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీసుకున్నారని తెలుస్తోంది. రఘురామకు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. ఇండ్ భారత్ పేరుతో కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ నాటి సీఎం వైఎస్ హయాంలోనే బలంగా తయారవడం గమనార్హం. వైఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావుకు ఆర్ ఆర్ ఆర్ వియ్యంకుడు. దీంతో.. ఆ విధంగా రఘురామ రాజు ఫుల్లుగా ఎదిగారని చెబుతారు.
అంతేకాదు.. రఘురామ వ్యాపారాల్లో విజయసాయి సలహాలు, సూచనలు కూడా ఉన్నాయని అంటారు. అప్పుడు మంచిగా మెలిగిన రోజుల్లో అలా సాగిపోయింది. ఆ విధంగా.. రఘురామ ఆర్థిక అంశాలకు సంబంధించిన అన్ని విషయాలూ విజయసాయికి తెలుసని కూడా అంటున్నారు. ఇటు చూస్తే.. రఘురామ సంస్థలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని, వాటిని సరిగా చెల్లించలేదని ఏకంగా సీబీఐ కేసులు కూడా నమోదయ్యాయి. కోర్టుల్లో కూడా కేసులు ఉన్నాయి. ఈ విషయాలన్నీ విజయసాయికి తెలుసు.
ఇప్పుడు ఇదే అస్త్రంతో రఘురామను దెబ్బతీసేందుకు ప్లాన్ గీస్తున్నట్టు సమాచారం. ఒకవైపు.. నర్సాపురం ఎంపీపై అనర్హత వేటు వేయించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రయత్నం అటు సాగిస్తూనే.. ఇటు రఘురామ ఆర్థిక మూలాలపైనా దెబ్బతీసే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం. ఈ విషయాలను ప్రధానికి, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లడం ద్వారా మరింత ఒత్తిడి పెంచేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. మరి, ఈ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయన్నది చూడాలి.