Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: జగన్ పై తిరగబడుతున్న సైన్యం

CM Jagan: జగన్ పై తిరగబడుతున్న సైన్యం

CM Jagan: సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఏ క్షణమైనా షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పెద్ద స్థాయి నాయకులకు గెలుపోటములపై భయం ఉండగా.. ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఆవేదనతో ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది నేతలు దూకుడుగా వ్యవహరించారు. ముందూ..వెనుక చూసుకోకుండా ఇక అంతా మాదే అన్నట్టు నడుచుకున్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాల నుంచి.. కరోనా సేవల వరకు చాలా డబ్బులు ఖర్చు చేశారు. కానీ రోజులు నెలలుగా మారాయి.. నెలలు సంవత్సరాలయ్యాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపించాయి. కానీ ఇంతవరకు బిల్లుల చెల్లింపు లేకుండా పోయాయి. అస్మదీయ కంపెనీలకు మాత్రం రుణాలు తెచ్చి మరి చెల్లింపులు చేశారు. కానీ పార్టీని నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నాయకులను మాత్రం దారుణంగా వంచించారు.

మరి కొద్ది రోజుల్లో ఎన్నికల కోడ్ రానుంది. ఎటువంటి ప్రభుత్వ చెల్లింపులకు అవకాశం ఉండదు. అందుకే చేసిన పనులకు బిల్లులు చెల్లించండి అంటూ వేలాదిమంది వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు పెద్ద నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. వారిపై ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం మారితే పైసా కూడా ఎవరని ఆందోళన చెందుతున్నారు. అయితే గత ప్రభుత్వాలు.. ముందు ప్రభుత్వాలు చేసిన పనులకు బిల్లులు చెల్లించేవి. జగన్ సర్కార్ ఆ సంప్రదాయాన్ని మార్చేసింది. గత ప్రభుత్వంలో జరిగిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించలేదు. బాధితులు కోర్టులకు వెళ్లినా..వారికి న్యాయం జరగలేదు. దీంతో రేపు టిడిపి ప్రభుత్వం వచ్చిన అదే పని చేస్తుందని వైసిపి చోటా నేతలకు తెలుసు. అందుకే వారు ఆందోళన చెందుతున్నారు.

వివిధ ప్రభుత్వ పథకాల్లో భాగంగా వేలకోట్ల రూపాయల పనులు చేసిన అస్మదీయ కంపెనీలకు బిల్లులు చెల్లించారు. అప్పులు తెచ్చి మరి కట్టబెట్టారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసిన వారికి.. కరోనా కష్టకాలంలో ఆహారం అందించిన చిన్నాచితకా కాంట్రాక్టర్లకు మాత్రం మొండి చేయి చూపారు. వీరంతా వైసీపీ సానుభూతిపరులే అయినా చెల్లింపులు విషయానికి వచ్చేసరికి మాత్రం రిక్తహస్తం చూపించారు. వీరి కోసం ఎమ్మెల్యేలు, ఆ పై స్థాయిలో నాయకులు ప్రయత్నించినా పని జరగలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపించే సరికి ఏదోలా సర్దుబాటు చేయండి అంటూ వారు కాళ్ళా వేళ్లా పడుతున్నారు. ఇప్పుడు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకు వేలాది దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆయన సైతం ముఖం చాటేస్తున్నట్లు సమాచారం. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు అయితే.. తమకు ఇంత దారుణంగా వంచించిన జగన్ ఎలా గెలుస్తారో చూస్తామని ప్రతిన బూనుతున్నారు. గత ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యేందుకు అహోరాత్రులు శ్రమించిన వారే.. అదే జగన్ సర్కార్ చుట్టూ బిల్లుల కోసం తిరుగుతున్నారు. బిల్లులు దక్కక పోయేసరికి ప్రత్యర్థులుగా మారుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular