Free current  scheme :ఈ పథకంతో ఫ్రీ కరెంట్ పొందచ్చు.. ఆపై అమ్ముకొని ఆదాయం కూడా ఆర్జించవచ్చు.. ఏ పథకమో తెలుసా?

వారసత్వ వనరులను భావితరాలకు అందించేందకు కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వనరులను వాడుకోవాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఇంటింటికీ విద్యుత్ అందించాలని సంకల్పించింది. అందుకు ఒక పథాకాన్ని తెచ్చింది. కానీ ఈ పథకంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సరైన అవగాహన లేక నీరు గారుతోంది. దీని గురించి ఓకే వ్యూవర్స్ కోసం..

Written By: NARESH, Updated On : August 19, 2024 7:53 pm

PM Surya Ghar Muft Bijli Yojana

Follow us on

Free current  scheme : రోజు రోజుకు విద్యుత్ చార్జిలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో మధ్య, దిగువ తరగతిపై చాలా భారం పడుతుంది. పైగా కరెంట్ ఉత్పత్తి కోసం వినియోగించే బొగ్గు, తదితర వనరులు కూడా భవిష్యత్ తరాల అవసరాల కోసం నిల్వ చేయాలని, అందుకు ప్రకృతి వనరులను ఉపయోగించుకోవాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దీని వల్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా.. ఉత్పత్తి చేసిన విద్యుత్ ను విద్యుత్ ను విక్రయించి ఆదాయం కూడా సమకూర్చుకోవచ్చు. ఈ పథకం పేరు ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లి యోజన’. దీని ద్వారా ప్రయోజనం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కోటిమందికి అవకాశం కల్పిస్తోంది. సోలార్ విద్యుత్తు ఏర్పాటుకు కోటి మందికి సబ్సిడీ కూడా ఇవ్వనుంది. అయితే ఇతర రాష్ట్రాల్లో ఈ స్కీమ్ కోసం చాలా మంది దరఖాస్తు చేసుకుంటున్నారట! కానీ, తెలుగు రాష్ట్రాల నుంచి సరైన స్పందన లేదని కేంద్రం వెల్లడించింది. దీనికి కారణం పథకం గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడమే అని నివేదికలో పేర్కొంది. అయితే ఈ పథకం గురించి పూర్తి వివరాలు, ఈ స్కీమ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సోలార్ ప్యానెల్ ఏర్పాటు..
ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలు (సోలార్ ప్యానెల్) ఏర్పాటు చేసుకోవడం ద్వారా రాయితీ కింద కేంద్ర ప్రభుత్వం కిలో వాట్ కు రూ. 30 వేలు సబ్సిడీ అందిస్తుంది. రెండు కిలో వాట్లకు రూ. 60 వేలు, మూడు, అంతకన్నా ఎక్కువ కిలోవాట్లకు రూ. 78 వేల వరకు సబ్సిడీ అందిస్తుంది. అంటే 3 కిలో వాట్ల సోలార్ రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసేందుకు రూ. 1.5 లక్షలు ఖర్చు అయితే అందులో రూ. 78 వేలు కేంద్రమే భరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని కూడా ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ ఐసీఐసీఐ, తదితర బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణంగా పొందవచ్చు.
* 150 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి 1-2 కిలో వాట్ల రూఫ్ టాప్ వ్యవస్థ సరిపోతుంది.
* 150-300 యూనిట్లు చొప్పున విద్యుత్ వాడేవారు 2-3 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి.
* 300 యూనిట్ల పైబడి విద్యుత్ వాడాలనుకునే వారు వారి సామర్థ్యాన్ని బట్టి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. కానీ రూ.78వేల వరకే సబ్సిడీ లభిస్తుంది.

దరఖాస్తు ఇలా చేసుకోవాలి..
దశ 1 – మీ పేరును ‘సూర్యఘర్’ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకొని మీ రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేసే కంపెనీని ఎంచుకొని వివరాలు సమర్పించాలి.
దశ 2 – లాగిన్ అయ్యాక ‘రూఫ్ టాప్ సోలార్’ కోసం అప్లయ్ చేసుకోవాలి.
దశ 3 – దరఖాస్తు పూర్తి చేసి డిస్కం నుంచి అనుమతులు వచ్చే వరకు వేచి చూడాలి. అనుమతి వచ్చిన తర్వాత డిస్కంలోని విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకోవాలి.
దశ 4 – ఇన్ స్టాలేషన్ పూర్తయిన తర్వాత, ప్లాంట్ వివరాలను పోర్టల్ లో సమర్పించి.. నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
దశ 5 – ఆ తర్వాత అధికారులు తనిఖీ చేసి కమిషనింగ్ సర్టిఫికెట్ ఇస్తారు.
దశ 6 – రిపోర్ట్ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్ పోర్టల్ లో సబ్మిట్ చేయాలి.

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నెలలోగా మీ ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమ అవుతుంది.