YSR Congress
YSR Congress: ఏపీలో 2024 సాధారణ ఎన్నికలకు ఇంకొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ సారి గెలుపు అన్ని పార్టీలకు అంత సునాయాసం కాదు. ప్రతిపక్షాలన్ని ఏకమవుతాయంటూ జరుగుతున్న ప్రచారానికి ఆయా పార్టీల నుంచి స్పష్టమైన సంకేతాలేమి వెలువడటం లేదు. వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తానని ప్రకటించేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ‘ఒంటరి’ నినాదానికే కట్టుబడి ఉంటారా? లేదా? అన్న చర్చ మొదలైంది.
గత నాలుగేళ్లుగా ప్రతిపక్షాలపై రాజకీయంగా, ఆర్థికంగా, మానసికంగా హింసపెడుతూ వస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ను ఆ విధంగానే ఇబ్బందులు గురిచేశారంటూ వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. అధికారంలో టీడీపీ ఉన్నప్పుడు లెవనెత్తిన ఎన్నో ఆరోపణలు చేసిన జగన్, వాటికి భిన్నంగా రాజకీయాలు చేసి చూపుతానని చెప్పుకొచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చిన తరువాత సొంత అజెండాను తెరపైకి తీసుకువచ్చారు.
అధికార వైసీపీపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. దానిని జారనివ్వకుండా చూసుకునేందుకు టీడీపీ, జనసేన పార్టీలు ఏక విధానంపైనే ముందుకు వెళ్తున్నాయి. పొత్తు విషయంపై నిర్ణయం మాత్రం వెలువరించలేదు. అయితే, వైసీపీ నేతలు మాత్రం రెండు పార్టీలు ఒకటేననే వాదన వినిపిస్తున్నాయి. కాగా, అన్ని రాష్ట్రంలోని అన్ని పార్టీలు కేంద్రంలోని బీజేపీకి దగ్గరవడానికి ప్రయత్నిస్తుండటం గమనించదగ్గ విషయం.
YSR Congress
‘‘నా ప్రభుత్వం మంచి చేయలేదని ప్రతిపక్షాలు భావిస్తే, వాళ్లు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు… సవాల్ విసురుతున్నా.. ఎన్నికల బరిలో 175 స్థానాల్లో ఒంటరిగా ముఖాముఖిగా ఎదుర్కొనే దమ్ముందా’’ అని ముఖ్యమంత్రి జగన్ సవాల్ విసిరారు. పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు ఏకమవుతుండటం బహుశా ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని ఆ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. ఏ పార్టీ కూడా ఒకరితో ఒకరు కలవకూడదని జగన్ భావిస్తున్నట్లు ఉన్నారు. అందుకు ‘‘ఒంటరి’’ అనే అస్త్రాన్ని ప్రయోగించినట్లు చెబుతున్నారు.
బీజేపీతో జనసేన కలిసే ఉందని చెబుతున్నా, ఆ పార్టీ నుంచి పవన్ కల్యాణ్ కు సరైన మద్దతు లభించడం లేదు. జగన్ తో బీజేపీ పెద్దలు అంటగాకుతున్నారనే ప్రచారం మొదలైంది. లోపాయికారీగా జగన్ కు పూర్తి మద్దతు ఇస్తూ, పవన్ కల్యాణ్ ను దూరంగా పెడుతున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. బహుశా బీజేపీతో పొత్తును అధికారంగా ప్రకటిస్తే మైనార్టీ ఓట్లపై ప్రభావం చూపుతుందని జగన్ భావిస్తూ ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వానికి వివేకా హత్య కేసు అంశం తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఆయన పలుమార్లు ఢిల్లీకి వెళ్లివచ్చారు. ఇతోధికంగా సహకరిస్తున్న బీజేపీ నేతలు తమతో చేతులు కలపాలని ఎన్నికల నాటికి అల్టిమేటం జారీ చేస్తే వైసీపీ చెబుతున్న ‘‘ఒంటరి’’ పోటీ ఉండకపోవచ్చు. ఏమో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు.