కొమురం భీమ్‌ వారసులకు ఈసారైనా ఊరట దక్కేనా?

జల్‌.. జంగల్‌.. జమీన్‌ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన నాయకుడు కొమురం భీమ్‌. నిజాం సైన్యానికి వణుకు పుట్టించిన ఆదివాసీ ముద్దుబిడ్డ. ఆ స్థాయిలో పోరాడి హక్కలు సాధించిన యోధుడి వారసులు మాత్రం ఇంకా కష్టాల్లోనే ఉన్నారు. నిజాం పాలనను తరిమికొట్టిన ఆ 12 గ్రామాల పోరాట యోధులు సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన కూడా అడవి బిడ్డల బతుకుల్లో మాత్రం ఏమాత్రం మార్పులేదు. భీమ్‌ వర్ధంతి సందర్భంగా నైనా […]

Written By: NARESH, Updated On : October 27, 2020 2:54 pm
Follow us on

జల్‌.. జంగల్‌.. జమీన్‌ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన నాయకుడు కొమురం భీమ్‌. నిజాం సైన్యానికి వణుకు పుట్టించిన ఆదివాసీ ముద్దుబిడ్డ. ఆ స్థాయిలో పోరాడి హక్కలు సాధించిన యోధుడి వారసులు మాత్రం ఇంకా కష్టాల్లోనే ఉన్నారు. నిజాం పాలనను తరిమికొట్టిన ఆ 12 గ్రామాల పోరాట యోధులు సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన కూడా అడవి బిడ్డల బతుకుల్లో మాత్రం ఏమాత్రం మార్పులేదు. భీమ్‌ వర్ధంతి సందర్భంగా నైనా తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకుంటుందేమోనని గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు.

Also Read: యాక్టివ్‌ రోల్‌లోకి కొండా దంపతులు! ఏం చేస్తారు?

కొమురం భీమ్‌ పురిటిగడ్డ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి అతిసమీపంలో ఉన్న రౌట సంకెపల్లి అనే గ్రామం. ఆ గ్రామం నేటికీ సమస్యలతో సతమతమవుతూనే ఉంది. జోడేఘాట్‌లోని చుట్టుపక్కల గ్రామాలైన కొలాం గూడ, పాట్నాపూర్, పెద్ద పాట్నాపూర్, శివగూడ, బాబేఝరీ, మహారాజ్ గూడా, పాటగుడా, చాల్బాడీ, టోకెన్మోవాడ్, గ్రామాలలో రోడ్డు, మురికి కాలువలు, వైద్యం, విద్యలాంటి అనేక కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని మట్టిఇళ్లు, వెదురు బొంగుల గుడిసెలు, గూణ పెంకుల ఇళ్లలో అలుపెరుగని వీరుల వారసులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు.

తెలంగాణ ఏర్పడ్డాక 2014 అక్టోబర్ 8న సీఎం కేసీఆర్ జోడేఘాట్‌లోని భీమ్ మ్యూజియంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌‌కు హాజరయ్యారు. ఆ సమయంలో ఆదివాసీల కష్టాలను అర్థం చేసుకుని భీమ్ మనుమరాలు సోంబాయితోపాటు జోడేఘాట్‌లోని 50 గిరిజన కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ హామీ కాస్త ఇంకా హామీగానే మిగిలిపోయింది. ముఖ్యమంత్రి హామీతో పక్కా ఇళ్లు వస్తాయని భావించిన గిరిజనులకు ఇప్పటికీ నిరాశే మిగిలింది.

Also Read: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: కీలక ట్విస్ట్ ఇదే!

జోడేఘాట్‌లో ఏ ఒక్కరికీ నేటికీ ఒక్క పక్కా గృహం కూడా ప్రభుత్వం నిర్మించి ఇవ్వలేదు. ఇక.. నిజాం సేనలపై పోరాడిన 12 గ్రామాల్లో రోడ్ల పరిస్థితి కూడా మరింత దయనీయం. చిన్న వర్షానికే అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి. దీంతో ఆదివాసీల కష్టాలు కన్నీళ్లను తెప్పిస్తున్నాయి. ఏటా కొమురంభీమ్‌ వర్ధంతికి నాయకులు, అధికారులు వస్తుంటారు. రాష్ట్ర మంత్రులు హాజరై హామీలు ఇచ్చి పోవడమే తప్ప ఏ ఒక్కటి తీర్చింది లేదు. ఇప్పుడు వచ్చేవర్ధంతికైనా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తారా అని అమాయక ఆదివాసీ ప్రజలు ఎదురు చూస్తున్నారు.