కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉప ఎన్నికల వాయిదా వేస్తోంది. ఈ కారణంగానే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం వాయిదా వేశారు. ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ ఉండదని తెలుస్తోంది. బెంగాల్ లో దీదీ కూడా తన పదవి నిలుపుకోవాలంటే ఏదో ఒక చోట నుంచి గెలవాలి. కానీ ప్రస్తుతం బీజేపీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకుండా చేస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికపై కూడా సందేహాలు వస్తున్నాయి. ఉప ఎన్నిక నిర్వహిస్తుందా లేక వాయిదా వేస్తుందా అని అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటివరకు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తోంది టీఆర్ఎస్ పార్టీ. ఈనెల 16న దళిత బంధు ప్రారంభం చేసి అక్కడే అభ్యర్థి ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ఎన్నిక షెడ్యూల్ రాక నేపథ్యంలో అభ్యర్థిని ప్రకటించి ప్రచారం ముమ్మరంగా చేపట్టాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో కేసీఆర్ మదిలో ఏముందో అనే విషయం ఎవరికి తెలియదు.
బీజేపీ నేత ఈటల రాజేందర్ అనారోగ్య కారణాలతో పాదయాత్ర మధ్యలోనే ఆపి ఆస్పత్రిలో చేరారు. గురువారం ఆగస్టు 5న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. ఈ నేపథ్యంలో తరువాత తీసుకోబోయే నిర్ణయాలపై వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. బెడ్ రెస్ట్ లో ఉంటారా లేక పాదయాత్ర కొనసాగిస్తారా అనే విషయంలో సందిగ్దం నెలకొంది. హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ వస్తుందనే సంకేతాల నేపథ్యంలో నేతల్లో వేగం పెరగనుందని చెబుతున్నారు.