Homeజాతీయ వార్తలుఉత్తమ్ సడన్ గా ఎందుకు యాక్టివ్ అయ్యారు?

ఉత్తమ్ సడన్ గా ఎందుకు యాక్టివ్ అయ్యారు?


ఉత్తమ్ కుమార్ రెడ్డి. పీసీసీ చీఫ్ గా ఒక్క ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చకుండా ఫ్లాప్ నాయకుడిగా కాంగ్రెస్ రాజకీయాల్లో మిగిలిపోయారు. తన సొంత ఇలాకా.. కాంగ్రెస్ కు కంచుకోట అయిన హుజూర్ నగర్ లో కూడా తన భార్యను గెలిపించలేకపోయారు. ఆ ఓటమితో రాజకీయాల్లో మౌనం దాల్చారు. తక్కువ ప్రొఫైల్ మెయింటేన్ చేశారు. ఓటమి తెచ్చిన నిరాశనో.. లేక గెలిపించలేకపోయానన్న బాధో కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం రాజకీయాల్లో కొద్దికాలంగా సైలెంట్ అయ్యారు.

*ఉత్తమ్ మళ్లీ యాక్టివ్..
తాజాగా లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఒక్కసారిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. వరుసగా ప్రకటనలు ఇవ్వడం.. విమర్శలను ఖండించడం.. ఆందోళనలు చేయడంతో లైమ్ లైట్ లోకి వచ్చారు. వాడి వేడి విమర్శలతో మరోసారి కాంగ్రెస్ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నారు.

*ఉత్తమ్ చురుకుదనం వెనుక కారణమేంటి?
సైలెంట్ గా ఉంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా సడన్ గా ప్లేటు ఫిరాయించి యాక్టివ్ కావడం వెనుక కారణమేంటన్న ప్రశ్న కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనికి కారణంపై ఆరాతీయగా.. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ నే కొనసాగించడానికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. ఆ భరోసాతోనే ఉత్తమ్ మళ్లీ యాక్టివ్ అయ్యాడని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

*ఉత్తమ్ ను ఆనాడే తీసేద్దామనుకున్నారు..
నిజానికి ఉత్తమ్ తన పదవీకాలాన్ని పూర్తిచేశారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఘోర పరాజయం పాలవ్వడం.. ఏమాత్రం పోటీ ఇవ్వకపోవడంతో ఉత్తమ్ తప్పుకోవాలనే డిమాండ్ వచ్చింది. అయితే తోక్ సభ ఎన్నికల వరకు ఉండమని పార్టీ ఉత్తమ్ ను కోరింది. తరువాత హూజూర్ నగర్ ఉప ఎన్నికల జరిగింది. అందులోనూ తన భార్యను గెలిపించలేకపోయాడు. దీంతో రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు. పీసీసీ చీఫ్ రేసులో చాలా మంది నిలిచారు.. వీహెచ్ నుంచి రేవంత్ రెడ్డి వరకు అందరూ టీపీసీసీ చీఫ్ కావాలని కోరుకున్నారు. అయితే ఉత్తమ్ వారసుడిని నిర్ణయించలేక..కొత్త పీసీసీ చీఫ్ నియామకాన్ని కాంగ్రెస్ అధిష్టానం వాయిదా వేసింది.

*జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు ఉత్తమే
ఇప్పుడు రేవంత్ సహా అందరూ ఆశగా ఎదురుచూస్తుండగా.. పీసీసీ చీఫ్ పీఠంపై ఫైట్ మొదలైంది. రేవంత్ వర్సెస్ సీనియర్లుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ కరోనా టైంలో అనవసరంగా కాంగ్రెస్ ను డిస్టబ్ చేయలేక జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు కొనసాగాలని హైకమాండ్ ఉత్తమ్ ను కోరినట్టు తెలిసింది.దీంతో మరో సంవత్సరం పాటు ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా కంటిన్యూ కాబోతున్నారు.

* భగ్గుమంటున్న పీసీసీ ఆశావాహులు
ఉత్తమ్ ను మళ్లీ పీసీసీ చీఫ్ గా కొనసాగించడంపై రేవంత్ రెడ్డి సహా ఆశావాదులు భగ్గుమంటున్నారు. హైకమాండ్ నిర్ణయం గురించి లోలోపల విరుచుకుపడుతున్నారు. ఉత్తమ్ ఒక్క ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ను గెలిపించలేకపోయినా తిరిగి ఆయనకే పదవి కట్టబెట్టడంపై కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోతున్నారు. ఇది ఎప్పుడు బద్దలవుతుందనేది అంతుచిక్కని విధంగా ఉంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version