Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే రంగంలోకి దిగారు. విద్యాశాఖ మీద తీవ్రంగా మధనం చేశారు. అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు విద్యాశాఖ మంత్రి పదవి కేటాయిస్తారని లీకులు ఇచ్చారు. దీంతో అందరూ అతడే కాబోయే విద్యాశాఖ మంత్రి అని ఒక అంచనాకొచ్చారు.
ఈ విషయం మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలియడంతో.. ఆయన వెంటనే రంగంలోకి దిగారు. తనను కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఎవరూ నియమించలేదని.. కేంద్రం నుంచి తనకు ఎటువంటి వర్తమానం రాలేదని.. ఇటువంటి కథనాలను రాస్తున్నప్పుడు వివరణ తీసుకోవాల్సిన బాధ్యత మీడియా ప్రతినిధులు కలిగి ఉండాలని ఆయన సూచించారు. దీంతో కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మళ్ళీ మొదలైంది.
మొత్తానికి సస్పెన్స్ కు తెర దించుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యాశాఖ మంత్రిని ప్రకటించింది. ఆ మంత్రి మరెవరో కాదు ప్రహ్లాద్ జోషి. ఈయనకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తో బలమైన సంబంధాలు ఉన్నాయి . ఈయనది కర్ణాటక రాష్ట్రం. ముందుగా ఈయన ధార్వాడ్ జిల్లా బిజెపి చీఫ్ గా పనిచేశారు. ధార్వాడ్ పార్లమెంటు స్థానంలో 2004.. 2009.. 2014.. 2019.. 2024 ఎన్నికలలో వరుసగా గెలిచారు. ప్రస్తుతం ఈయన కేంద్ర వినియోగదారులు.. ఆహారం.. ప్రజా పంపిణీ శాఖలకు మంత్రిగా పనిచేస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు బొగ్గు గనులు.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. కర్ణాటక రాష్ట్రానికి బిజెపి అధ్యక్షుడుగా కూడా పనిచేశారు.
ఈయనకు విషయ పరిజ్ఞానం ఎక్కువ. తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు. క్షేత్రస్థాయిలో ఎక్కువగా ఉంటారు. అందువల్లే వరుసగా ఐదుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో చాలా కాలం పని చేశారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేశారు. కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేశారు. కష్టకాలంలో నేర్పరితనాన్ని ప్రదర్శించే నాయకుడిగా ప్రహ్లాద్ జోషి కి పేరుంది. ఇవన్నీ నచ్చిన తర్వాతే నరేంద్ర మోడీ ప్రహ్లాద్ ను విద్యాశాఖ మంత్రిగా నియమించారు. అయితే ఇప్పటికే విద్యశాఖ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఈ సమస్యలను పరిష్కరించడం దానిమీదనే ప్రహ్లాద్ రాజకీయ జీవితం ఆధారపడి ఉందని విశ్లేషకులు అంటున్నారు.







