Processed Food: కొన్నేళ్లుగా మనిషి ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతోంది. ఆదాయం పెరుగుతోంది. దీంతో జీవన శైలిలోనూ మార్పులు వస్తున్నాయి. భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా కుటుంబాలు వంటింటికి టాటా చెబుతున్నాయి. హోటళ్ల బాట పడుతున్నాయని తాజాగా ఓ సర్వేలో తేలింది. ఇంట్లో వంట చేసుకోవడానికి బద్ధకంతోపాటు వెరైటీ ఫుడ్ తినాలన్న కోరిక ఇందుకు కారణమని సర్వే వెల్లడించింది. దీంతో ప్రాసెస్డ్ ఫుడ్ను తెగ లాగించేస్తున్నారని పేర్కొంది. దీంతో వీధి వీధినా హోటళ్లు, రెస్టారెంట్లు వెలుస్తున్నాయని, ఫుడ్ డెలివరీ యాప్లు, నిమిషాల్లో గ్రోసరీలు తీసుకొచ్చే యాప్లు పెరుగుతున్నాయని అంచనా వేసింది.
ఎంఓఏసీపీఐ, ఐసీఐసీ సెక్యూరిటీస్ సర్వే..
ఇక మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్(ఎంఓఏసీపీఐ), ఐసీఐసీఐ సెక్యూరి టీస్ చేసిన మరో అధ్యయనంలో కూడా సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆ నివేదికల్లోని గణాంకాలను పరిశీలిస్తే..
= పదేళ్ల క్రితంతో పోలిస్తే 2022–23 ఆర్థిక సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో అధిక ఆదాయ వర్గాల వారు ప్యాకేజ్డ్ ఫుట్, డైనింగ్ ఔట్, ఫుడ్ డెలివరీ కోసమే తమ ఫుడ్ బడ్జెట్లో 50 శాతం ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. గతంలో ఇది 41.2 శాతం ఉండేది. మధ్య తరగతి కుటుంబాలు తమ ఆహార బడ్జెట్లో ప్రాసెస్డ్ ఫుడ్, పానయాలపై చేస్తున్న ఖర్చు పదేళ్లలో 16 శాతం నుంచి 25 శాతానికి చెరిగినట్లు వెల్లడించింది.
అధిక ఆదాయం ఉన్నవారే ఎక్కువ..
అధికాదాయ కుటుంబాలకు సంబంధించి చూస్తే.. ‘స్టేపుల్ ఫుడ్ (ముడి ఆహార పదార్థా ల)’పై వ్యయం తగ్గుతోందని.. క్రమంగా వారి ఇళ్లలో వంట గదులకు పనిలేకుండా పోతోందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రిపోర్ట్ పేర్కొంది.
= 2022–23లో అధిక ఆదాయం ఉన్న కుటుంబాల తలసరి ఫుడ్ డెలివరీ వ్యయం నెలకి ఏకంగా రూ.971గా ఉంది. అదే మధ్య తరగతి, తక్కువ ఆదాయ కుటుంబాల తలసరి ఫుడ్ డెలివరీ ఖర్చు రూ.60గా ఉంది.
= గడిచిన పదేళ్లతో పోల్చితే ఇంట్లో వంట చేసుకోవడం బాగా తగ్గింది. హోటళ్లు, రెస్టారెంట్లలో తినడం పెరిగింది. అలా కుదరని పక్షంలో డెలివరీ యాప్ ద్వారా తెప్పించుకోవడం బాగా పెరిగింది. రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.
= గత పదేళ్లలో పోల్చితే ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగించే అధికాదాయ కస్టమర్లు రెండింతలు పెరిగారు. అదే మధ్య తరగతి కస్టమర్లు మూడింతలు పెరిగారు. సంపన్నులు.. చక్కెర శాతం తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, సేంద్రియ ఆహారం, పానీయాల వినియోగం పెంచారు. మిగతా వర్గాల వారూ వాటివైపు ఆకర్షితులవుతున్నారు.
= డ్రైఫ్రూట్స్ను తీసుకుంటున్న కుటుంబ వ్యయం పట్టణ ప్రాంతాల్లో 1.3 శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 1.2శాతంగా ఉంది.
పట్టణ ప్రాంత కుటుంబాల ఆదాయం పెరిగినా.. ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాలపై ఖర్చు తగ్గి.. ధాన్యాలు (సెరీల్స్), కోడిగుడ్లు, చేప, మాంసం వంటనూనె వంటి వాటి వినియోగం గతంలోని స్థాయిలోనే ఉండిపోయింది.