Homeజాతీయ వార్తలుKarimnagar MP: కరీంనగర్‌ ఎంపీ బరిలో గెలిచేదెవరు? ఊపు ఎవరికుంది?

Karimnagar MP: కరీంనగర్‌ ఎంపీ బరిలో గెలిచేదెవరు? ఊపు ఎవరికుంది?

Karimnagar MP: పార్లమెంటు ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. దీంతో తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు ఎన్నికలపై దృష్టి సారించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు గెలుస్తామని ధీమాతో ఉంది. ఇక గత ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి మరో నాలుగు అంటే మొత్తం 8 స్థానాలు గెలవాలని భావిస్తోంది. ఈమేరకు వ్యూహరచన చేస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి డీలా పడిన బీఆర్‌ఎస్‌.. లోక్‌సభ ఎన్నికల్లో అయినా గెలిచి పరువు, పార్టీని కాపాడుకోవాలనుకుంటోంది. ఈమేరకు గులాబీ పార్టీ తరఫున కేసీఆర్, హరీశ్‌రావు పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తున్నారు.

కరీంనగర్‌పై అందరి దృష్టి..
కరీంనగర్‌ ఉద్యమాలకు పురిటి గడ్డ. మలి విడత తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊదిన గడ్డ. రెండు దశాబ్దాలుగా కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా ఇక్కడి నుంచి పోటీచేసి గెలిచి తెలంగాణ ఉద్యమానికి మంరిత ఊపు తెచ్చారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌ విజయం సాధించారు. అయితే 2019లో ఇక్కడ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ విజయం సాధించారు. దీంతో బీర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న కరీంనగర్‌లో కమలం జెండా తొలిసారి పాతినట్లయింది.

ఈసారి పాతకాపులే..
కరీంనగర్‌ నుంచి ఈసారి బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి పాత కాపులే బరిలో ఉంటారని తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ నుంచి వినోద్‌కుమార్‌ పోటీ చేస్తారని ఇటీవలే ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. ఇక బీజేపీ నుంచి కూడా సంజయ్‌ బరిలో ఉండడం ఖాయమైనట్లు సమాచారం. అయితే ఆ పార్టీలో ఉదయ్‌నందన్‌రెడ్డి కూడా టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. కానీ, బీజేపీ అధిష్టానం సంజయ్‌వైపే మొగ్గు చూసే అవకాశం ఉంది. ఒకవేళ సంజయ్‌కు జహీరాబాద్‌ టికెట్‌ ఇస్తే, కరీనంగర్‌ను ఉదయ్‌నందర్‌రెడ్డిని పోటీకి దించే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్‌ మాత్రం కొత్త అభ్యర్థి వేటలో పడింది. గతంలో ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్‌ నుంచి గెలిచారు. దీంతో ఆయన పోటీ చేసే అవకాశం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పురుమళ్ల శ్రీనివాస్, రాజేందర్‌రెడ్డి పేర్లు గటిగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని కూడా బరిలో దింపే అవకాశం ఉంది.

గెలిచేదెవరో..
ఇక కరీంనగర్‌ బరిలో ప్రధాన పోటీ బీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందని అంతా భావిస్తున్నారు. అయితే ఈసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినందున గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ నిర్వహించిన అంతర్గత సర్వేలో బీజేపీనే మళ్లీ గెలుస్తుందని తేలిందట. ఇంకో షాకింగ్‌ విషయం ఏమిటంటే.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌ మూడో స్థానానికి పరిమితమవుతాడని తేలిందట. దీంతో గులాబీ నేతల్లో టెన్షన్‌ కనిపిస్తోంది.

కాపు, మైనారిటీ ఓట్లే కీలకం..
కరీంనగర్‌ పార్లమెంటు పరిధిలో కాపు ఓట్లే కీలకంగా మారనున్నాయి. బండి సంజయ్‌ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన నేత. బీసీ నేతగా ఆయనకు కాపులతోపాటు, ముదిరాజ్‌లు, పద్మశాలీలు, యాదవులు మద్దతు ఇస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని మోదీ ప్రకటించిన నేపథ్యంలో మాదిగలు బీజేపీకే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇక వినోద్‌కుమార్‌ వెలమ జామాజికవర్గం నేత. కరీంనగర్‌ ఒకప్పుడు వెలమలకు అడ్డా. అయితే దొరల ఆధిపత్యం ఏమిటి అన్న భావన సొంత పార్టీలోనే నెలకొంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లోటమి, పార్టీ అధిష్టాన పట్టించుకోవడం లేదని కేడర్‌లో ఉన్న అసంతృప్తి ఆ పార్టీ అభ్యర్థికి మైనస్‌ పాయింట్లుగా మారాయి. ఇక కాంగ్రెస్‌ రెడ్డి అభ్యర్థిని నిలపాలని భావిస్తోంది. అదే సమయంలో వెలిచాల జగపతిరావు తనయుడు రాజేందర్‌రావు కాంగ్రెస్‌ టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈయన కూడా వెలమ సామాజికవర్గం నేతనే. ఇక కాంగ్రెస్‌ కరీనంగర్‌లో ఉన్న రెడ్డి ఓటర్లు, మైనారిటీ ఓటర్లను నమ్ముకుంది. అందుకే రెడ్డి సామాజికవర్గం నేతను బరిలో నిలపాలని భావిస్తోంది. అయితే జీవన్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే అగ్రవర్ణ నేతల నడుమ బీజేపీ లాభ పడవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి జాతీయ పార్టీల అభ్యర్థులనే గెలిపిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాంతీ బీఆర్‌ఎస్‌కు అవకాశం దక్కక పోవచ్చని అంచనా వేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular