నెక్ట్స్‌ సీజే ఎవరు?.. అంతటా ఆసక్తికర చర్చ

భావి భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరో ప్రశ్న ఇప్పుడు అంతటా ఆసక్తికరంగా మారింది. సీనియార్టీ రేసులో ఉన్న జస్టిస్‌ ఎన్వీ రమణకే ఆ అవకాశం దక్కుతుందా..? అనేది తెలియకుండా ఉంది. సుప్రీంకోర్టు కొలీజియం తీసుకునే నిర్ణయం ఏంటి..? తదుపరి సీజేగా ప్రస్తుత సీజే బాబ్డే ఎవరిని సిఫార్సు చేయబోతున్నారు..? కేంద్ర ప్రభుత్వానికి వెళ్లే సిఫార్సు, కొలీజియం తీసుకునే నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. అన్నింటి కంటే మించి ఏపీ నుంచి తొలిసారి సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ […]

Written By: Srinivas, Updated On : March 22, 2021 4:40 pm
Follow us on


భావి భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరో ప్రశ్న ఇప్పుడు అంతటా ఆసక్తికరంగా మారింది. సీనియార్టీ రేసులో ఉన్న జస్టిస్‌ ఎన్వీ రమణకే ఆ అవకాశం దక్కుతుందా..? అనేది తెలియకుండా ఉంది. సుప్రీంకోర్టు కొలీజియం తీసుకునే నిర్ణయం ఏంటి..? తదుపరి సీజేగా ప్రస్తుత సీజే బాబ్డే ఎవరిని సిఫార్సు చేయబోతున్నారు..? కేంద్ర ప్రభుత్వానికి వెళ్లే సిఫార్సు, కొలీజియం తీసుకునే నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.

అన్నింటి కంటే మించి ఏపీ నుంచి తొలిసారి సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ అయ్యే అవకాశానికి అడుగు దూరంలో ఉన్న జస్టిస్‌ ఎన్వీ రమణ రికార్డు సృష్టిస్తారా లేక గతంలో ఏపీ ప్రభుత్వం ఆయనపై చేసిన ఆరోపణలు అడ్డంకిగా మారతాయా..? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ శరద్‌ బాబ్డే పదవీకాలం వచ్చే నెల 23తో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో వచ్చే తదుపరి సీజే కోసం కసరత్తు ప్రారంభమైంది. సీనియార్టీ ప్రాతిపదికన సుప్రీంకోర్టు కొలీజియం చేపట్టే ఈ నియామకం చాలా కీలకమైనది.

ఇందుకోసం ప్రస్తుత సీజే బాబ్డే సిఫార్సు చేసే పేరును కేంద్ర న్యాయశాఖ పరిశీలించి సుప్రీంకోర్టు కొలీజియానికి పంపుతుంది. ఇతరత్రా ఆరోపణలు, ఇబ్బందులేవీ లేకపోతే కొలీజియం దానికే ఆమోద ముద్ర వేస్తుంది. అసాధారణ పరిస్ధితుల్లో మాత్రమే సీజే, కేంద్రం పంపిన పేరును కొలీజియం తిరస్కరిస్తుంది. దీంతో తర్వాత ఛీఫ్ జస్టిస్‌ ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలేవీ చోటు చేసుకోకపోతే సీనియార్టీ ప్రకారం ఛీఫ్‌ జస్టిస్‌ రేసులో ముందున్న ఎన్వీ రమణకే అవకాశం దక్కబోతోంది. ఏపీలోని గుంటూరు జిల్లాకి చెందిన జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ పదవి అలంకరించిన తొలి తెలుగు వాడిగా గుర్తింపు పొందనున్నారు. ప్రస్తుత సీజే బాబ్డే జస్టిస్‌ ఎన్వీ రమణ పేరును తదుపరి సీజేగా ప్రతిపాదిస్తారని అంచనా వేస్తున్నారు.

అదే జరిగితే కేంద్రం కూడా సుప్రీంకోర్టు కొలీజియానికి ఆయన పేరును పంపించక తప్పదు. అప్పుడు తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రమణ పేరు ఖరారయ్యే అవకాశముంది. ఒకవేళ జస్టిస్ రమణ సీజే పదవి చేపడితే ఆయన ఏకంగా 16 నెలలపాటు ఆ పదవిలో ఉండే అవకాశం ఉంది. ఆయన 2022 ఆగస్టులో రిటైర్‌ అవుతారు.