దుబ్బాక, జీహెచ్ఎంసీలో కాస్త ఫలితాలు అటుఇటుగా వచ్చినా.. నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మాత్రం తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి కాస్త ఊరటనిచ్చాయి. దీంతో అధినేత కేసీఆర్లో ఉత్సాహం రెట్టింపైంది. ఇక తమకు తిరుగులేదని మరోసారి చాటే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే.. ఎప్పటిలాగే ఫటాఫట్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
మొన్నటివరకు వెనకా ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్.. ఇప్పుడు ఆ పంథాను మార్చారు. నాగార్జున సాగర్ బైపోల్లో మరణించిన నోముల నర్సింహయ్య కుమారుడు భగత్కే టిక్కెట్ కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు నల్లగొండ పార్టీ వర్గాలకు సమాచారం పంపినట్లు టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. నోముల భగత్కు పార్టీ నేతల సహకారం కూడా ప్రారంభమైంది. ఆయన ప్రచారానికి.. నామినేషన్కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇప్పటివరకూ నోముల భగత్ను కేసీఆర్ పరిగణనలోకి తీసుకోలేదు. చనిపోయిన వారి కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇస్తే గెలవడం లేదన్న సెంటిమెంట్ ఇటీవలి కాలంలో తెలంగాణలో ఏర్పడింది. ఆ స్థానాల్లో ఉపఎన్నికల్లో కుటుంబసభ్యులెవరూ గెలవడం లేదు. అయితే అది అన్ని సార్లు వర్కవుట్ కాదని.. కేసీఆర్కు ఇప్పుడు బలమైన నమ్మకం ఏర్పడింది. అదే సమయంలో.. సాగర్ టిక్కెట్ బీసీలకే ఇద్దామనుకున్నారు. రెడ్డి సామాజికవర్గానికి వారు పోటీపడినప్పటికీ.. బీసీల టిక్కెట్ బీసీలకే ఇద్దామని డిసైడయ్యారు. ఓ వైపు కాంగ్రెస్ తరపున జానారెడ్డి బరిలో ఉండటంతో అదే సామాజికవర్గానికి చెందిన వారికి ఇవ్వడం కరెక్ట్ కాదని అనుకున్నారు.
సాగర్ నియోజకవర్గంలో అత్యధికం యాదవ సామాజికవర్గానికి చెందిన వారే ఉన్నారు. ఆ సామాజికవర్గానికి చెందిన ఇతర పార్టీ నేతలు ఎవరూ బలవంతులు కాదు. వారు పార్టీకి భారంగా మారతారు కానీ.. పార్టీకి వారి బలం ప్లస్ అయ్యే పరిస్థితి లేదు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు వరకూ కేసీఆర్కు ధైర్యం లేకపోయింది. ఇప్పుడు మాత్రం.. ఆయన ఒకే అభిప్రాయంతో ఉన్నారు. దీంతో నోముల కుమారుడికి టిక్కెట్ ఖరారయింది. దీనిపై టీఆర్ఎస్లో అసంతృప్తి వ్యక్తమయ్యే పరిస్థితి కూడా లేదు.