Pawan Kalyan BJP Alliance: ఏపీలో ఎన్నికలకు పట్టుమని పది నెలలు కూడా సమయం లేదు. కానీ పొత్తులు కొలిక్కి రావడం లేదు. కచ్చితంగా ఏపీలో ఎన్ డిఏ అధికారం చేపడుతుందని పవన్ ప్రకటించారు. ఢిల్లీలోని ఎన్డీఏ భాగస్వామి పక్షాల సమావేశానికి హాజరైన తర్వాత ఈ ప్రకటన చేశారు. ఎన్డీఏ అంటే బిజెపి జనసేనయేనా,లేకుంటే టిడిపి కలిసి వస్తుందా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ బిజెపి జనసేన మధ్య ఇంకా కార్యాచరణ ప్రారంభం కాలేదు. బిజెపి,జనసేన నేతలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు.
బిజెపి ఏపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియమితులయ్యారు. ఆమెకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ భాగస్వామి సమావేశాలకు పవన్ హాజరయ్యారు. ఈ తరుణంలో బిజెపి, జనసేన మధ్య బలమైన బంధం ఏర్పడుతుందని అంతా భావించారు. కానీ ఇంతవరకు ఏపీ బీజేపీ నేతలు పవన్ ను కలవడం కానీ… పవన్ బిజెపి నేతలను కలవడం గానీ జరగలేదు. దీంతో ఢిల్లీలో స్నేహం.. ఏపీలో కయ్యం అన్నట్టు ఆ రెండు పార్టీల వ్యవహార శైలి మారింది.
ఏపీలో బిజెపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ కార్యక్రమాలేవి కనిపించకపోవడంతో రెండు పార్టీల శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ప్రస్తుతం బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి పర్యటనలతో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు మిత్రపక్షమైన జనసేనానిని కలవకపోవడం ఒక రకమైన లోటే.
గతంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సోమ వీర్రాజు తరచు పవన్ ను కలిసేవారు. చాలా అంశాలపై చర్చించేవారు. తమ అభిప్రాయాలను పంచుకునేవారు. రెండు పార్టీల మధ్య మైత్రి విషయంలో స్పష్టమైన ప్రకటనలు చేసేవారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ సర్కార్ అధికారంలో వస్తుందని పవన్ బలంగా చెబుతున్నప్పటికీ.. అందుకు తగ్గట్టు ఏపీ బీజేపీ నేతలు సహకారం అందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎప్పటికైనా బిజెపి జనసేన ఉమ్మడి కార్యచరణ ప్రారంభించాలని రెండు పార్టీల శ్రేణులు కోరుతున్నారు.