వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో బ్రేక్.. కారణమిదే?

అది 2019 సంవత్సరం.. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వాతావరణం మొదలైంది. అందరూ ఎవరికి వారుగా ప్రచారంలో మునిగిపోయారు. జగన్‌ కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కానీ.. అంతలోనే విషాదం. అది మార్చి 15. మాజీ మంత్రి, జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి చనిపోయారు. ముందుగా గుండె పోటుతో చనిపోయాడని అందరూ అనుకున్నా.. తర్వాత అది హత్యగా తేలింది. ఈ హత్యపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. అప్పటి ప్రతిపక్ష నేతగా […]

Written By: NARESH, Updated On : October 2, 2020 1:43 pm
Follow us on

అది 2019 సంవత్సరం.. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వాతావరణం మొదలైంది. అందరూ ఎవరికి వారుగా ప్రచారంలో మునిగిపోయారు. జగన్‌ కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కానీ.. అంతలోనే విషాదం. అది మార్చి 15. మాజీ మంత్రి, జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి చనిపోయారు. ముందుగా గుండె పోటుతో చనిపోయాడని అందరూ అనుకున్నా.. తర్వాత అది హత్యగా తేలింది.

ఈ హత్యపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేయగా.. అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కానీ.. నిందితులు మాత్రం దొరకలేదు. తాజాగా.. వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణకు సీబీఐ  వచ్చింది. తాజాగా సీబీఐ విచారణలో కీలక విషయాలు వెలుగుచూసినట్లు సమాచారం.

వివేకా హత్య కేసులో జులైలో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు మొదట 15 రోజుల పాటు విచారణ జరిపారు. ఆ తర్వాత మూడు బృందాలుగా విడిపోయి హత్యకు గల కారణాలను సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇద్దరు మహిళల ద్వారా సీబీఐ సేకరించినట్లు సమాచారం. తాజాగా కడప జిల్లాకు చెందిన ఇద్దరు ముస్లిం మహిళలు.. పులివెందులకు చెందిన బాబును సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వీరి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళలతోపాటు చెప్పుల షాప్ లో పనిచేస్తున్న భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించారు. ఆ చెప్పుల వ్యాపారి మున్నాను ఆరాతీశారు. మున్నా ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఆయన బ్యాంకు లాకరులో భారీ మొత్తంలో నగదును సీబీఐ అధికారులు గుర్తించారు. మూడు రోజుల క్రితం మున్నాను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది.

సీబీఐ విచారణలో వేగం పెంచడంతో త్వరలోనే తేలిపోతుందని భావిస్తున్న సమయంలో సీబీఐ అధికారుల విచారణకు కరోనా బ్రేక్ వేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న విచారణ అధికారికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇక కరోనా భయం పట్టుకున్న మిగతా అధికారులు సైతం ఈరోజు కరోనా పరీక్షలు చేయించుకోనున్నారు. ఇక అధికారులు విచారించిన ఖైదీలు. ఇతరులకు కూడా కరోనా బారినపడడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో వివేకా హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

కాగా ఈ కేసు విచారణలో జరుపుతున్న జాప్యం వైఎస్ వివేకా కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనిపై ఫైట్ చేయాలని వారు డిసైడ్ అయ్యారు. వైఎస్ వివేకా హత్య కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మా, కూతురు సునీత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలువాలని నిర్ణయించినట్టు సమాచారం.   ఈ హత్య కేసును తేల్చాలని వారు కోరుతారని తెలుస్తోంది.