ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి బెంగాల్ ఎన్నికలపైనే పడింది. అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆసక్తి ఒకటైతే.. ముఖ్యమంత్రి గెలుస్తారా? ఓడిపోతారా? అన్నది మరో ఇంట్రస్టింగ్ పాయింట్. ఈ రెండు అంశాలపై ఎవరి చర్చలు వారివి కొనసాగుతుంటే.. మూడో ప్రశ్న బయలుదేరింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచి.. మమతా బెనర్జీ ఓడిపోతే ఏంటీ పరిస్థితి? ఇదే చాలా మంది ఊహించని ప్రశ్న. దీనికి సమాధానం ఏంటనేది చూద్దాం.
బెంగాల్ లో ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఇప్పటి వరకైతే పార్టీల పరంగా తృణమూల్ ముందంజలో ఉంది. అటు ప్రతిష్టాత్మకంగా మారిన నందిగ్రామ్ నియోజకవర్గంలో రెండో రౌండ్ ముగిసే సరికి మమతా బెనర్జీ వెనకంజలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదేవిధమైన ఫలితాన్ని చెప్పాయి. బెంగాల్ లో స్వల్ప మెజారిటీతో తృణమూల్ గెలుస్తుందని కొన్ని సంస్థలు అంచనా వేశాయి.
అయితే.. నందిగ్రామ్ లో గెలుపు ఓటములపైనా ఆసక్తికర ఫలితాన్ని ప్రకటించాయి. మమత ఈ సారి తన నియోజకవర్గమైన భవానీపూర్ ను వదిలి నందిగ్రామ్ నుంచి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. దీనికి కారణం.. టీఎంసీ ప్రధాన నేతగా ఉన్న సువేంద్ అధికారి, తృణమూల్ ను వీడి బీజేపీ గూటికి చేరడమే! నందిగ్రామ్ లో సువేందు అధికారి బలమైన నేతగా ఉన్నారు. అలాంటి నేత ఉన్నట్టుండి కాషాయ తీర్థం తీసుకుని, బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
దీంతో.. మమత తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తనను ధిక్కరించి వెళ్లిన సువేందును ఎలాగైనా ఓడించాలని ఆయనపైనే పోటీకి దిగారు. దీంతో.. హోరాహోరీ పోరు సాగింది. అక్కడ బలమైన నేతగా ఉన్నగా సువేందు ఓ వైపు ఉండగా.. ముఖ్యమంత్రి మరోవైపు నిలవడంతో పోటీ అత్యంత ఆసక్తికరంగా సాగింది. దీంతో.. ఏం జరగబోతోందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఒకవేళ మమతా ఓడిపోయి, టీఎంసీ గెలిస్తే.. ఏం జరుగుతున్నంది ఇప్పుడు ప్రశ్న. అప్పుడు మమతా బెనర్జీ సోనియా అవతారంఎత్తాల్సి ఉంటుంది. యూపీఏ రిమోట్ కంట్రోల్ దగ్గర పెట్టుకొని వెనకుండి నడిపించినట్టుగా.. మమత కూడా వేరే వ్యక్తిని సీఎం చేసి పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే జరిగితే.. మమతా బెనర్జీ మేడనల్లుడు అభిషేక్ బెనర్జీకి పట్టాభిషేకం జరగొచ్చు. (అది కూడా అతను గెలిస్తే) లేదంటే.. మరో విధేయుడిని కుర్చీపై కూర్చో బెట్టాల్సి ఉంటుంది.
కానీ.. ఇదంతా సాఫీగా సాగుతుందా అన్నది ప్రశ్న. కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి.. యూపీఏను నడిపించడం సోనియాకు ఇబ్బంది కాలేదు. కానీ.. తృణమూల్ బెంగాల్ కు మాత్రమే పరిమితమైన పార్టీ. మమత ముఖ్యమంత్రి కాదంటే.. పరిస్థితుల్లో చాలా మార్పులు వస్తాయి. పార్టీలో చీలికలు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అదే జరిగితే.. మమతకు మరింత గట్టి దెబ్బ తగిలినట్టే. టీఎంసీకి ఇన్ని ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో.. మమత గెలుపు ఆ పార్టీకి అత్యంత అవసరం. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.