KCR National Party: బీజేపీతో ఇప్పుడే వద్దు.. కేసీఆర్ జాతీయ పార్టీ గోవిందా..!

KCR National Party: జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దున్నేద్దాం అనుకున్న కేసీఆర్ కు పరిస్థితులు ఏవీ కలిసిరావడం లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ కు బీజేపీ వ్యూహాత్మకంగా చెక్ పెట్టింది. బలం లేకపోవడంతో ఏపీ సీఎం జగన్ ను, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ను మచ్చిక చేసుకొని ఎన్నికల్లో గెలుపును సులభతరం చేసుకుంది. దీంతో కేసీఆర్ ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇవ్వలేక.. ఇటు ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించేశారు. ఆయన […]

Written By: NARESH, Updated On : June 24, 2022 2:17 pm
Follow us on

KCR National Party: జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దున్నేద్దాం అనుకున్న కేసీఆర్ కు పరిస్థితులు ఏవీ కలిసిరావడం లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ కు బీజేపీ వ్యూహాత్మకంగా చెక్ పెట్టింది. బలం లేకపోవడంతో ఏపీ సీఎం జగన్ ను, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ను మచ్చిక చేసుకొని ఎన్నికల్లో గెలుపును సులభతరం చేసుకుంది. దీంతో కేసీఆర్ ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇవ్వలేక.. ఇటు ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించేశారు. ఆయన ఓడిపోతాడని తెలియడంతో ప్రచారం గట్రా ఏమీ చేయకుండానే మౌనంగా ఉండిపోయారు.

ఇక దేశంలోనే పాపులర్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కలిసి వ్యూహాలు పన్నుతున్న కేసీఆర్.. జాతీయ పార్టీ కోసం దేశవ్యాప్తంగా పనిచేసే కీలక నేతలను వెతికే పని పెట్టుకున్నా ఎక్కడా కేసీఆర్ తో కలిసి నడిచే వాళ్లు దొరక్కపోవడంతో పార్టీ ముందుకు సాగడం లేదట..దీంతో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఆలస్యం అవుతోంది. మరో రెండు నెలల పాటు కేసీఆర్ సమాలోచనలు జరుపున్నట్టు తెలుస్తోంది. తర్వాత పార్టీ పెట్టాలా? వద్దా? అని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఇక పక్కరాష్ట్రం మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కేసీఆర్ ఇప్పుడప్పుడే తొందరపడకూడదని.. తాజా రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక సెంటిమెంట్లను బాగా నమ్మే కేసీఆర్ జాతీయ పార్టీని ముహూర్తం చూసి లాంచ్ చేయాలని చూస్తున్నారు. జాతీయ రాజకీయాలను మార్చాలంటే బలమైన సమయం కావాలని.. అందుకే కేసీఆర్ అనుకూలమైన సమయం కోసం వేచిచూస్తున్నట్టు తెలుస్తోంది. ఈనెల 30వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆషాఢ మాసంలో ఎటువంటి పనులు చేయరని సమాచారం. దీంతో వచ్చే నెలలో జాతీయ పార్టీ ప్రకటన ఉండబోదని తెలుస్తోంది.

ఇప్పటికే జాతీయ పార్టీపై దేశంలోని రాజకీయ ప్రముఖులు, ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్ లాంటి వారితో మంతనాలు జరిపినప్పటికీ ఓ స్పష్టతకు కేసీఆర్ రాలేకపోయారు. ఇక బీఆర్ఎస్ పార్టీ పెడితే గుర్తు, టీఆర్ఎస్ విలీనం తదితర సమస్యలున్నాయి. ఇంకా ఆ సందిగ్ధత పోలేదు. టీఆర్ఎస్ తెలంగాణలో బలంగా ఉండడంతో బీఆర్ఎస్ గా మారితే తెలంగాణలోనూ పార్టీకి పెద్ద దెబ్బ.

ఇలాంటి ఆటంకాల మధ్య కేసీఆర్.. జాతీయ పార్టీ జోలికి పోదలుచుకోలేదు. మంచి ముహూర్తం.. రాజకీయంగా దేశంలో శూన్యత ఏర్పడినప్పుడే జాతీయ పార్టీని పెట్టాలని యోచిస్తున్నట్టు సమాచారం. దీంతో జాతీయ పార్టీ ఆలోచన మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.