చట్ట సభలలో పెండింగ్లో ఉన్న బిల్లుల ప్రక్రియ పూర్తయ్యే వరకూ రాజధాని తరలించే అవకాశం లేదని ప్రభుత్వం పేర్కొంది. గతంలో ఈ విషయంలో హైకోర్టులో దాఖలైన పిటీషన్ కు సమాధానం ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో సచివాలయ ఉద్యోగుల సంఘం చేసిందిగా చెప్పబడుతున్న తీర్మానంపై ఆధారపడి ఆ వ్యాజ్యం దాఖలు చేశారని, అదంతా ఊహాగానమే అని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం చట్ట సభలలో బిల్లు ప్రక్రియ పూర్తి కోసం ఎదురు చూస్తుందని, ఆ తరువాతనే చట్టాలను అనుసరించి చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో రాజధాని తరలింపు జరుగుతుందని వేసిన ఈ పిటీషన్ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది.
రాజధాని తరలింపుపై హైకోర్టులో అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతి రావు మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. గతంలో దాఖలు చేసిన పిటిషన్ ఈనెల 4వ తేదీన విచారణకు రావాల్సి ఉండగా, రాకపోవడంతో మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. విశాఖపట్నం నగరానికి ఈ నెల 10వ తేదీన సచివాలయంలో ఫర్నిచర్ తరలించాలని, విజ్ఞాన్ కళాశాల సమీపంలోని గ్రేహౌండ్ ప్రాగణంలో వీటిని దించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది అని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాజధాని తరలింపు కోసం ముహూర్తం పెట్టారని జరుగుతున్న ప్రచారంపై గత నెల 24వ తేదీననే పిటీషన్ వేసినట్లు తిరుపతి రావు తరఫు న్యాయవాది వున్నం మురళీధర్ హైకోర్టు ధర్మాసనానికి గుర్తుచేశారు. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
అయితే, ఈ పిటిషన్కు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.