
Amit Shah’s Welcoming : హైదరాబాద్లో బీఆర్ఎస్ ఫ్లెక్సీల రాజకీయం కొనసాగిస్తుంది. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనవేల మరోసారి నగరంలో భారీగా ఫ్లెక్సీలు పోస్టర్లు ఏర్పాటు చేసింది. అందులో ఓ వైపు కవిత, మరోవైపు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్న నేతల చిత్రాలు ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. మార్చి 11న అమిత్ షా హైదరాబాద్కు వచ్చారు. ఇదే రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత ఈడీ విచారణ కూడా జరిగింది. దీంతో అమిత్ షా పర్యటనకు ముందే హైదరాబాద్లో బీఆర్ఎస్ నేతలు భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు. విపక్ష నేత బీజేపీలో చేరితే అతనిపై ఎలాంటి విచారణ జరగబోదని, దానికి విరుద్ధంగా మరక నుంచి క్లీన్ అవుతారని ఈ పోస్టర్లో చూపించారు. హోర్డింగ్లో వాషింగ్ పౌడర్ నిర్మా.. వెల్కమ్ టూ అమిత్ షా అంటూ రాసుకొచ్చారు. అలాగే, బీజేపీ నేతలు హిమంత బిశ్వశర్మ, నారాయణ రాణే, సువేందు అధికారి, సుజనా చౌదరి, జ్యోతిరాధియ సింధియా సహా పలువురు నేతల ఫొటోలు పెట్టారు. ఎంత అవినీతికి పాల్పడినా బీజేపీలో చేరితే మరకలు పోతాయనే అర్థం వచ్చేలా హోర్డింగ్స్ పెట్టారు.
కవిత విచారణపై నిరసన..
ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితను శనివారం ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఆ కేసును కవితపై మోపడానికి వ్యతిరేకంగా బీజేపీపై బీఆర్ఎస్ పార్టీ నేతలు అసలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అమిత్ షా హైదరాబాద్ కు రానుండడంతో వినూత్నంగా పోస్టర్లతో ఇలా నిరసనలు తెలిపారు.
చల్లారని ఈడీ వేడి.. తెలంగాణలో ఈడీ వేడి రాజేసింది. అధికార బీఆర్ఎస్, బీజేపీ మధ్య నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తగ్గేదేలే అన్నట్టుగా రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. హైదరాబాద్ పర్యటన వేళ పోస్టర్ల కలకలం చోటు చేసుకుంది.
మోదీ షా వ్యూహాలు ఎవరికీ అంతు చిక్కవు. వారి కంట్లో పడితే ఊరికే వదిలిపెట్టరు. ఈ విషయం కెసిఆర్ కు తెలియంది కాదు. ఆయన కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఫ్లెక్సీ పాలిటిక్స్ పై బీజేపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
