
ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం పూణే ఇన్స్టిట్యూట్ పై ఆధారపడిన ఏపీ ప్రభుత్వం, ఇక నుండి ఆ అవసరం లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో వైరల్ ల్యాబ్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.కోటి 25 లక్షలతో ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. దీంతో వైరస్ నిర్ధారణకు 6 గంటల సమయం పట్టనుంది. విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ వైరల్ ల్యాబ్ అందుబాటులోకి రానుంది.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 300 దాటాయి. నిన్నటి వరకు 266గా ఉన్న కరోనా కేసులు కొత్తగా మరో 37 కేసులు పెరిగి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 303గా నమోదు కావడం గమనార్హం. ఇప్పటివరకు కరోనాతో ముగ్గురు మరణించారు.కర్నూలు జిల్లాలో కరోనా కలకలం కొనసాగుతోంది. అక్కడ మరో 18 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో కర్నూలు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74కి చేరింది. నెల్లూరు జిల్లాలోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇవాళ కొత్తగా 8 పాజిటివ్ కేసులను గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో 42 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
సోమవారం కొత్తగా నమోదైన కేసులను జిల్లాల వారీగా పరిశీలిస్తే, కర్నూలులో 18, నెల్లూరు 8, పశ్చిమ గోదావరి 5, కడప 4, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్క పాజిటివ్ కేసు చొప్పున నమోదైంది. మరోవైపు ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకుని ఆరుగురు డిశ్చార్ అయ్యారు. ఇక మొత్తం జిల్లాల వారిగా చూస్తే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అత్యధికంగా కర్నూలు 74లో నమోదు అయ్యాయి.
ఆయా జిల్లాల్లో ఇప్పటివరకు నమోదైన కేసులను పరిశీలిస్తే, నెల్లూరులో 42, గుంటూరు 32, కృష్ణా 29, కడప 27, ప్రకాశం 24, పశ్చిమ గోదావరి 21, విశాఖపట్నం 20, చిత్తూరు 17, తూర్పుగోదావరి 11, అనంతపురం 6 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.