ప్రధానితో మాట్లాడాలని అనుకుంటున్నానని పీఎంఓ కార్యాలయానికి కాల్ చేసి చెబితే, ఆ వెంటనే ప్రధాని తనకు ఫోన్ చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఓ పాతికసార్లు ప్రాధేయపడివుంటారని, అందుకే మోదీ కాల్ చేసి ఉండవచ్చని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్వీట్ పెట్టారు.
ప్రధాని మోదీ పారిశుద్ధ్య కార్మికులతో, నర్సింగ్ సిస్టర్లతో, కరోనా నుంచి కోలుకున్న వారితో కూడా మాట్లాడారని, నిత్యం ఎంతో మందికి ఫోన్లు చేసి ప్రశంసిస్తారని, పరామర్శిస్తారని తెలిపారు. మోదీ వినమ్రత అటువంటిదని పేర్కొన్నారు.
పెద్ద నోట్ల రద్దు సలహా తనే మోదీకి ఇచ్చానని అప్పట్లో బాబు డప్పుకొట్టుకుని క్రెడిట్ కొట్టేయాలని చూసినా ప్రధాని హుందాతనంతో వదిలేశారన్నారు. ఉదయం ఫోన్ వస్తే నాలుగు గంటలు ఓపిక పట్టలేనోడు, ‘మూడు జోన్ల’ లేఖ విషయం ఇన్నాళ్లు దాచాడంటే అది బోగస్ అని తెలుస్తూనే ఉందిని పేర్కొన్నారు.
ప్రదాని ఏం మొహం పెట్టుకుని ఏపికి వస్తాదంటూ, మోదీ గో బ్యాక్ అని ఫ్లెక్సీలు కట్టించిన విషయం ప్రజలిప్పటికీ గుర్తుపెట్టుకున్నారని, వ్యక్తిగత విషయాలపై నీచంగా ఆరోపణలు చేసిన సంగతి మోదీగారు మర్చిపోయుంటాడని బాబు అనుకుంటున్నాడని తెలిపారు. ప్రదాని అపార జ్ఞాపకశక్తి కలిగిన వ్యక్తిగా చెప్పారు. అయినా ప్రజలు తిరస్కరించిన వాడిని ఎవరూ ఆదరించరని బాబును ఉద్దేశించి పేర్కొన్నారు.