మసకబారిన తెల్లవారుజామున ఏపీలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది.
రెండు ఆర్టీసీ బస్సులు, లారీ ఒకదాన్ని ఒకటి ఢీకొన్న సంఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం జిల్లా సుంకరిపేట వద్ద విశాఖ, విజయనగరం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
టైరు పేలి విజయనగరం బస్సును విశాఖ బస్సు ధీకొంది. ఇంతలో వెనుక నుంచి వస్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ విజయనగరం బస్సును ఢీకొంది. మూడు వాహనాలు పరస్పరం ఢీకొనడంతో బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో మరో 28 మందికి గాయాలైనట్లు డీఎస్సీ అనిల్ కుమార్ తెలిపారు.
ఇక 108లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరిలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కొందరికి పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
కాగా ఘటన జరిగిన ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఉండడంతో చెత్తను తగుల బెడుతున్నారు. దీంతో పొగ రహదారిని కమ్మేసింది. ఈ సమయంలో అటుగా వచ్చిన వాహనాలకు దారి కనిపించలేదు. దీంతో పాటు వాహనాల అతివేగం ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు, ఆర్టీసీ అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.