Homeజాతీయ వార్తలుఓటుకు నోటు కేసులో ట్విస్ట్: కోర్టులో రేవంత్ రెడ్డి.. ‘బాబు’కు ఆందోళన

ఓటుకు నోటు కేసులో ట్విస్ట్: కోర్టులో రేవంత్ రెడ్డి.. ‘బాబు’కు ఆందోళన

సుప్రీం కోర్టు తీర్పుతో నేతల పూసాలు కదిలిపోతున్నాయి. కోర్టులన్నీ ఇప్పుడు నేతల కేసులపైనే విచారణ జరుపుతున్నాయి. దీంతో వాళ్లలో గుబులు మొదలైంది. దేశంలో ప్రజాప్రతినిధుల కేసులపై విచారణ ఏళ్ల తరబడిగా సాగుతుండడం, కోర్టుల్లో భారీగా పోగుపడి ఉండడంతో.. సుప్రీంకోర్టు దీనికి చెక్ పెట్టాలని భావించింది. ఈ మేరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేయాలని ఆదేశించింది. దేశంలో 4,859 కేసులు తెలంగాణలో 143కేసులు పెండింగ్లో ఉన్నాయి..

Also Read: దుబ్బాక పాలి‘ట్రిక్స్’.. రేవంత్ రహస్య చర్చలు..!

సుప్రీం ఆదేశాలతో నాంపల్లి సెషన్స్ కోర్టు రోజువారీ విచారణను సోమవారం షురూ చేసింది. విచారణకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నేరెళ్ల టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్య, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.

ఇక చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ఓటుకు నోటు కేసులో కీలక ట్విస్ట్ నెలకొంది. తెలంగాణ సీఎంగా కేసీఆర్ అయిన కొత్తలో ఈ ఓటుకు నోటు కేసు సంచలనమైంది. ఆ తర్వాత స్తబ్దుగా మారిపోయింది. మళ్లీ ఈ కేసు తెరపైకి వచ్చింది.

తాజాగా ఏసీబీ కోర్టుకు కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహా కూడా కోర్టుకు హాజరయ్యారు. ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరి (ఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదిక, ఆడియో టేపులను ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించారు. వాటిని ఏసీబీ కోర్టు పరిశీలించింది.

2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేట్ చేసిన ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు టీడీపీ-బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటూ రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి ‘ఓటుకు నోటు’ కేసులో ఏసీబీ చేతిలో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరాడు. కాంగ్రెస్ ఎంపీ అయ్యాడు.

Also Read: హైదరాబాద్ హై అలర్ట్: వణికిస్తున్న వాయు‘గండం’!

దాదాపు రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న కేసు తాజాగా మరోసారి విచారణకు వచ్చింది. దీంతో ఇవాళ కోర్టుకు రేవంత్ రెడ్డి సహా మిగతా వారు హాజరయ్యారు. సుప్రీం కోర్టు నేతలపై కేసుల విషయంలో విచారణ వేగవంతం చేయాలని కోరడంతో ఈ కేసు ఏమవుతుంది? రేవంత్ రెడ్డి భవితవ్యం ఏం తేలనుందనేది ఉత్కంఠ రేపుతోంది.ఇక ఈ కేసులో రేవంత్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి ప్రభావితం చేసిన చంద్రబాబు కూడా ఇరుక్కొని ఉన్నాడు. దీంతో ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందనేది టీడీపీలో ఆందోళనకు దారితీస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version