Homeఆంధ్రప్రదేశ్‌ఎవరి ఆశల్లో వారు.. తిరుపతి పైనే అందరి దృష్టి

ఎవరి ఆశల్లో వారు.. తిరుపతి పైనే అందరి దృష్టి

AP Political Parties
తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు కోసం పార్టీలు రేసు గుర్రాల లాగా పరుగెత్తుతున్నాయి. అన్ని పార్టీలూ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇప్పుడు సీఎం జగన్‌ కూడా నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఉప ఎన్నికల్లో సాధారణంగా సీఎంలు ఎక్కడా ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు లేవు. కానీ.. ఈ ఉప ఎన్నికల్లో మాత్రం జగన్‌ ప్రచారం చేయబోతున్నారు. జగన్‌ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనరని నిన్నామొన్నటి వరకూ వైసీపీ వర్గాలే చెబుతూ వచ్చాయి. కానీ.. అనూహ్యంగా ఒక్కసారిగా షెడ్యూల్‌ చేంజ్‌ అయింది.

ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుపతి లోక్ సభ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. జగన్ ప్రచారానికి దిగాలని నిర్ణయించడం ఇతర పార్టీల నేతలకు ధైర్యం ఇచ్చినట్లయింది. వైసీపీ ఇప్పటికే నైతికంగా ఓడిపోయిందని విమర్శలు ప్రారంభించారు. జగన్ ఓటు అడగరని.. ప్రకటనలు చేసిన మంత్రులపై టీడీపీ నేతలు ఇప్పుడు సెటైర్లు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ.. వైసీపీ ప్రభావం తగ్గిందని నిరూపించాలన్న పట్టుదలతో ఉంది. గత మెజార్టీ కంటే వైసీపీకి తగ్గిస్తే చాలనుకుంటోంది.

అంతేకాదు.. క్లస్టర్ల వారీగా కార్యాలయాలు ప్రారంభించి ఇన్‌చార్జీలను నియమించిన టీడీపీ ఇంటింటికీ ప్రచారం చేస్తోంది. లోకేష్ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు కూడా రంగంలోకి దిగుతున్నారు. పార్టీలోని అన్ని స్థాయిల నేతలను టీడీపీ తిరుపతిలో మోహరింపచేసింది. ప్రతి ఓటర్‌ను కలవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జగన్ ప్రచారానికి వస్తుండడంతో పరిస్థితి వారు చెబుతున్నంత తేలిగ్గా లేదని.. నమ్మకంతో టీడీపీ నేతలు మరింత చురుగ్గా ప్రచారం చేస్తున్నారు.

తిరుపతి బీజేపీ అభ్యర్థి కోసం బీజేపీ ముఖ్యనేతలెవరూ రావడం లేదు. పార్టీ అధ్యక్షుడు నడ్డా మాత్రం ఒక రోజు వస్తున్నారు. ఆ రోజే పవన్ కల్యాణ్ కూడా ఆయనతోపాటు సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఇక పవన్ ప్రచార సభ ఉండదు. బహుశా 12న నడ్డా, పవన్ కంబైన్డ్ సభ ఉంటుంది. బీజేపీ అగ్రనేతలొస్తేనే తానొస్తానని పవన్ చెప్పిన మీదటే నడ్డా వస్తున్నట్లుగా భావిస్తున్నారు.ఇదిలా ఉండగా.. బీజేపీలో మొదట్లో కనిపించిన ఊపు ఇప్పుడు కనిపించడంలేదు. ఎన్నికలు ఎదుర్కొన్న అనుభవం ఉన్న నేతలు బీజేపీలో తక్కువ ఉండటమే దీనికి కారణంగా భావిస్తున్నారు. మోడీ వేవ్‌ కలిసొస్తుందనే ధీమాలో మాత్రం బీజేపీ నేతలు ఉండిపోయారు. చూడాలి మరి.. ఈ ఎన్నికలో ఎవరి చరిష్మా ఏ మేరకు పనిచేస్తుందో..!

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version