మరికొద్ది రోజుల్లో తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓ వైపు రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో.. ఇక ప్రధాన పార్టీలన్నీ తిరుపతిపై ఫోకస్ పెట్టాయి. ఇక జనసేన–-బీజేపీలు కూడా పోటీపై ఓ క్లారిటీకి వచ్చేశాయి. పవన్తో చర్చించి బీజేపీ నుంచి అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటన విడుదలైంది. దీంతో కమలం పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే చర్చ జరుగుతోంది. శనివారం విజయవాడలో బీజేపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. తిరుపతి ఉప ఎన్నికతోపాటూ రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించారు.
Also Read: పవన్ రాజకీయ జీవితం మొత్తం త్యాగాలేనా..?
జనసేన–-బీజేపీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపుతారనే చర్చ మొదలైంది. ఈ రేసులో ప్రధానంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. ముగ్గురు రిటైర్ అధికారులు, మరో స్థానిక నేత అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆ నలుగురిలో రిటైర్డు ఐఏఎస్ అధికారులు దాసరి శ్రీనివాసులు, రత్నప్రభ, రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్ ఉన్నారు. ఇక తిరుపతి బీజేపీ నేత ముని సుబ్రమణ్యం పేరు కూడా తెరపైకి వచ్చింది. వీరిలో దాసరి శ్రీనివాసులు, రత్నప్రభ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. గతంలో కూడా తిరుపతి నుంచి విద్యావంతులకు అవకాశం ఇస్తున్నారు.
బీజేపీ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతుందనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గ పరిధిలోని ఓటర్లలోనూ విద్యావంతులు అధికంగా ఉన్నారు. అందుకే విద్యాధికులనే అభ్యర్థులుగా ఎంచుకుంటున్నారు. 1999లో రిటైర్ ఐఏఎస్ అధికారి వెంకటస్వామి బీజేపీ-–టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసినపుడు గెలుపొందారు. బీజేపీ 2009లో మళ్లీ పోటీచేసి ఓడిపోయారు. 2014లో జయరాం బీజేపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. తాజాగా బీజేపీ పరిశీలనలో ఉన్న నలుగురిలో ముగ్గురు రిటైర్ అధికారులే ఉన్నారు. నలుగురిలో ఒకరికి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
Also Read: తిరుపతి వేదికగా.. బీజేపీకి పరీక్ష
నలుగురిలో దాసరి శ్రీనివాసులుకే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పేరు మొదటి నుంచి బలంగా వినిపిస్తోంది. రత్నప్రభ, కృష్ణప్రసాద్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. నియోజకవర్గ ఓటర్లకు, ముఖ్యంగా పార్టీ శ్రేణులకు పరిచయం ఉన్న అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి వస్తే బీజేపీ దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి ముని సుబ్రమణ్యం పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆయన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో రిజిస్టర్డ్ కాంట్రాక్టరుగా ఉన్నారు. ఈ నలుగురిలోనే ఒకరు ఉమ్మడి అభ్యర్థిగా పోటీకి దిగుతారనే చర్చ జరుగుతోంది. దీనిపై రెండు మూడు రోజుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్