BRS: గులాబీ పార్టీకి సపోర్ట్ చేశారు.. ఇప్పుడు ట్రోల్ అవుతున్నారు

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే అప్పట్లో ఈ యూట్యూబర్లు, టీవీ యాంకర్లు చేసిన ప్రచారం పై కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు దుమ్మెత్తిపోస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : December 4, 2023 10:43 am
Follow us on

BRS: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి సోషల్ మీడియాలో కొంతమంది యూట్యూబర్లు, టీవీ యాంకర్లు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. బిత్తిరి సత్తి, శివ జ్యోతి అలియాస్ సావిత్రి, భాను, బిగ్ బాస్ మహబూబ్, యాంకర్ లాస్య, ఆమె భర్త మంజునాథ్, ఆశూ రెడ్డి, శ్రీముఖి, ముక్కు అవినాష్ చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఏకంగా గులాబీ జెండాలే రామక్క అనే పాటకు డ్యాన్స్ చేసి అంతర్గతంగా టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశారు. టిఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పారు. అయితే అప్పట్లో వీరు చేసిన ప్రచారంపై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ భారత రాష్ట్ర సమితి వీరి ని పూర్తిగా వినియోగించుకుంది.

ఎన్నికల ఫలితాల తర్వాత

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే అప్పట్లో ఈ యూట్యూబర్లు, టీవీ యాంకర్లు చేసిన ప్రచారం పై కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు దుమ్మెత్తిపోస్తున్నారు. నాడు భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూసారని మండిపడుతున్నారు. కానీ ఇప్పుడు కర్మ వారికి ఎదురు తిరిగిందని.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని చెబుతున్నారు. బుల్లితెర నటులు, యూట్యూబర్లు వారి పని వారు చేసుకుంటే బాగుండేదని.. కానీ ఒక పార్టీ ఇచ్చిన డబ్బులకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేశారని మండిపడుతున్నారు.

కామెంట్ ఆప్షన్ లేకుండా చేశారు

ఇక ఈ సంగతి అలా ఉంచితే .. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఎన్నికల సమయంలో భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా ప్రచారం చేసిన యూట్యూబర్లు, యాంకర్లను నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. అడ్డగోలుగా నాడు విష ప్రచారం చేసి.. నేడు ప్రజల దృష్టిలో ఒక పార్టీ కార్యకర్తలుగా మారిపోయారని మండిపడుతున్నారు. అయితే నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో వారంతా కూడా కామెంట్ ఆప్షన్ ను హైడ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెయిడ్ గులాబీ బ్యాచ్ అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.