Kodi Kathi Case
Kodi Kathi Case: ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ లండన్ టూర్ లో ఉన్నారు. భార్య భారతి తో కలిసి వారం రోజులు పర్యటన కోసం వెళ్లారు. వ్యక్తిగత పర్యటన అని చెప్పుకున్నా..ఇండియన్ మోస్ట్ సీనియర్ లాయర్ హరీష్ సాల్వే పెళ్లి కోసమే ఆయన లండన్ వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెళ్లిళ్లకు హాజరయ్యేందుకు తీరిక ఉంది కానీ.. విశాఖ ఎన్ఐఏ కోర్టుకు హాజరయ్యేందుకు మాత్రం తీరిక లేదంటూ కోడి కత్తి కేసులో నిందితుడి తరపు న్యాయవాది సలీం ప్రశ్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
విజయవాడ ఎన్ఐఏ కోర్టు నుంచి.. కోడి కత్తి దాడి కేసును విశాఖ కోర్టుకు రిఫర్ చేసిన సంగతి తెలిసిందే. కేసు విచారణకు సీఎం జగన్ హాజరు కావడం లేదు. దీంతో విచారణలో జాప్యం జరుగుతోంది. తాజాగా కేసు విచారణకు వచ్చింది. అత్యున్నత పదవిలో ఉన్నందున అడ్వకేట్ కమిషన్ను నియమించుకునేందుకు అవకాశం కల్పించాలని జగన్ తరుపు లాయర్లు న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు ఉన్న కోర్ట్ కేసును ఈ నెల 20 కి వాయిదా వేసింది. అనంతరం కోర్టు ప్రాంగణంలో నిందితుడు తరుపు న్యాయవాది సలీం సంచలన వ్యాఖ్యలు చేశారు.
దళిత బిడ్డను జైల్లో మగ్గిపోయేలా చేసి..జగన్ మాత్రం పెళ్లిళ్లకు, విహారయాత్రలకు వెళ్తున్నారని సలీం ఆరోపించారు. ప్రస్తుతం జగన్ లండన్ లో ఉన్నారు. హరీష్ సాల్వే పెళ్లికి హాజరయ్యారు.
హరి సాల్వే దేశంలో ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరు. భారత మాజీ సొలిసిటర్ జనరల్ గా కూడా వ్యవహరించారు. కేంద్రం ఇటీవల జమిలి ఎన్నికల అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కమిటీలు హరిష్ సాల్వే ఒక సభ్యుడు. ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. వివాహానికి నీతా అంబానీ, లలిత్ మోడీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. వ్యక్తిగత పర్యటనకు వెళ్ళిన జగన్ దంపతులు సైతం ఈ వివాహానికి హాజరైనట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ కేసులో విజయనగరం జడ్పీ చైర్మన్, మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు కీలకంగా ఉన్నారు. ఆయన చుట్టూనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోజు నిందితుడు శ్రీనివాసరావుకు కోడి కత్తి సమకూర్చింది మజ్జి శ్రీనివాస రావేనని నిందితుడు తరుపు న్యాయవాది సలీం ఆరోపిస్తున్నారు. ఆరోజు విశాఖ ఎయిర్పోర్టులో ఐదుగురు వైసీపీ నేతలు అనుమతి లేకుండా ప్రవేశించారని.. ఇందుకు సంబంధించి వివరాలను కోర్టు ముందు ఉంచనున్నట్లు సలీం ప్రకటించారు. కేసు విచారణలో భాగంగా మజ్జి శ్రీనివాసరావు తన ఫోను విచారణ అధికారులకు ఎందుకు అప్పగించ లేదని ప్రశ్నించారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. సమయం వచ్చినప్పుడు కోర్టుకు సమర్పిస్తామని లాయర్ ప్రకటించడం విశేషం. కోడి కత్తి శ్రీను లేవనెత్తుతున్న ప్రశ్నలపై.. సమాధానం చెప్పేందుకు జగన్ తరుపు లాయర్లు వెనుకడుగు వేయడం విశేషం.